అమరావతి : ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను ప్రైవేట్పరం చేయనున్నారని జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని ఏపీ ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ ద్వారకా తిరుమల రావు స్పష్టం చేశారు. అద్దెబస్సుల పెంపుతో ఆర్టీసీ ప్రైవేటు వాళ్ల చేతుల్లోకి వెళ్తుందనేది అవాస్తవమని కొట్టి పారేశారు. సొంత బస్సులు కొని నడిపే స్థోమత ఏపీ ఆర్టీసీకి లేదని అన్నారు. దేశవ్యాప్తంగా రవాణా సంస్థలు సొంత బస్సులు కొని నడిపే పరిస్థితులో లేదని అన్నారు.
అద్దె బస్సుల పెంపు వల్ల ఆర్టీసీకి వాణిజ్యపరంగా లాభమేనని వెల్లడించారు. కొత్తగా 998 బస్సులకు టెండర్లు ఆహ్వానించామని తెలిపారు. ప్రస్తుతం ఆర్టీసీలో 23 శాతం ప్రైవేట్ బస్సులుఉన్నాయని, కొత్త బస్సుల వల్ల 32 శాతానికి పెరుగుతుందని ఆయన వెల్లడించారు. అద్దెబస్సుల నిర్వహణ , డ్రైవర్ జీతభత్యాలంతా బస్సు యాజమాన్యానిదేనని ఆయన పేర్కొన్నారు.