తిరుమల : తిరుమల(Tirumala) లో భక్తుల రద్దీ కొనసాగుతుంది . కలియుగ ప్రత్యక్షదైవం వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు 7 కంపార్టుమెంట్లలో వేచియున్నారు. టోకెన్లు లేని భక్తులకు 8 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు (TTD officials) వివరించారు. నిన్న స్వామివారిని 55,537 మంది భక్తులు దర్శించుకోగా 20,486 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 3.02 కోట్లు వచ్చిందన్నారు.
వటపత్రశాయి అలంకారంలో కోదండరాముని దర్శనం
ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో (Brahamotsavam) భాగంగా మూడో రోజు శుక్రవారం స్వామివారు వటపత్రశాయి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం చేపట్టిన ఊరేగింపు వైభవంగా కొనసాగింది. పురాణాల ప్రకారం.. జలప్రళయం సంభవించినపుడు శ్రీమహావిష్ణువు మర్రి ఆకుపై తేలియాడుతూ చిన్న శిశువుగా దర్శనమిస్తారు. కుడికాలి బొటనవేలిని నోటిలో పెట్టుకుని ఆస్వాదిస్తుంటారు. ఈ ఘట్టాన్ని గుర్తుచేస్తూ శ్రీమహావిష్ణువు అవతారమైన శ్రీరాముడు భక్తులకు కనువిందు చేశారు.