తిరుమల : తిరుమలలో శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు తరలివస్తున్నారు. నిన్న 31,815 మంది భక్తులు శ్రీ వారిని దర్శించుకున్నారని టీటీడీ అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా కానుకల రూపేణా స్వామి వారి హుండీ ఆదాయానికి రూ.3.43కోట్లు వచ్చిందని తెలిపారు. 14,538 మంది తలనీలాలు సమర్పించుకున్నారని వివరించారు. కొవిడ్ కారణంగా భక్తులు తగు జాగ్రత్తలు పాటించాలని, ముఖ్యంగా తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని సూచించారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొవిడ్ –19 మూడవ వేవ్ ఒమిక్రాన్ రూపంలో దేశ వ్యాప్తంగా విస్తరిస్తున్న నేపథ్యంలో హెచ్చరికలు జారీ చేసిందన్నారు. ఖచ్చితంగా వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ లేదా దర్శనానికి 48 గంటల ముందు చేసుకున్న ఆర్టీపీసీఆర్ పరీక్ష నెగిటివ్ సర్టిఫికెట్ను అలిపిరి చెక్ పాయింట్ వద్ద చూపించిన వారిని మాత్రమే తిరుమలకు అనుమతిస్తామని టీటీడీ అధికారులు పేర్కొన్నారు.