Lunar Eclipse | శనివారం రాత్రి పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడనుండటంతో శ్రీశైల మహాక్షేత్ర ఆలయ ద్వారాలను సాయంత్రం ఐదు గంటలకు మూసివేశారు. ఆదివారం ఉదయం ఐదు గంటలకు ఆలయ ద్వారాలను తెరిచి, ఆలయ శుద్ధి, సంప్రోక్షణ చేసి, ప్రాత:కాల పూజలు చేస్తారు. తదుపరి ఉదయం ఏడు గంటల నుంచి భక్తుల దర్శనాలకు అనుమతి ఇస్తారు. భక్తుల ఆర్జిత అభిషేకాలు, ఇతర ఆర్జిత సేవలు ప్రారంభిస్తారు.
చంద్రగ్రహణం కోసం ఆలయాలను మూసివేయనున్న నేపథ్యంలో శనివారం మధ్యాహ్నం 3.30 గంటల వరకు మాత్రమే భక్తులకు ఆలయ దర్శనానికి అనుమతించారు. మధ్యాహ్నం 12.30 గంటలకు గర్భాలయ ఆర్జిత అభిషేకాలు నిర్వహించామని దేవస్థానం తెలిపింది.
శనివారం ఉదయం మాత్రమే సామూహిక అభిషేకాలు నిర్వహించారు. రూ. 500 టికెట్ ధరపై స్వామి వారి స్పర్శ దర్శనానికి ఉదయం అనుమతించారు. మధ్యాహ్నం 12.30 గంటలకు నిర్వహించే సామూహిక అభిషేకాలు, స్పర్శ దర్శనం నిలిపివేశారు. మధ్యాహ్నం 3.30 గంటల నుంచి మంగళ వాయిద్యాలు, సుసాంధ్యం, సాయంకాల పూజలు, మహా మంగళ హారతులు నిర్వహించారు.
చంద్రగ్రహణం వల్ల శ్రీ స్వామి వార్ల నిత్య కల్యాణం కూడా నిలిపివేశారు. ఆలయ ప్రాంగణంలోని పరివార ఆలయ ద్వారాలు, సాక్షి గణపతి హఠకేశ్వరం -ఫాలధార పంచదార, శిఖరేశ్వరం తదితర ఉపాలయాల ద్వారాలు కూడా సాయంత్రం ఐదు గంటలకు మూసివేశారు.
చంద్ర గ్రహణం నేపథ్యంలో శనివారం భక్తులకు అన్న ప్రసాద వితరణ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం వరకే నిర్వహించారు. రాత్రి అల్ఫాహార వితరణ కూడా నిలిపి వేసినట్లు దేవస్థానం ఈవో పెద్దిరాజు తెలిపారు.