Srisailam | శ్రీశైల మహా క్షేత్రంలో ఉగాది ఉత్సవాల ఆరంభం అవుతున్నాయి. దీంతో కన్నడ భక్తుల రద్దీతో శ్రీశైల మహా క్షేత్రం కర్ణాటక రాష్ట్రాన్ని తలపిస్తోంది. కన్నడిగుల ఇంటి దైవమైన మల్లన్నను దర్శించుకునేందుకు ప్రతి పల్లె నుండి ముడుపులు కట్టుకుని కాలినడకన క్షేత్రానికి లక్షలాదిగా భక్తులు తరలి వస్తున్నారు. దేవస్థానం అధికారులు నెల రోజుల క్రితం నుండి కర్ణాటక రాష్ట్రానికి వెళ్లి దర్శన సమయాలను ఆలయ నిబంధనలను వివరించారు.
ప్రతి యేటా మోలిక వసతులను మెరుగుపరుస్తూ ముందస్తు ప్రణాళికతో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుటున్నట్లు శ్రీశైలం ఈవో డీ పెద్దిరాజు చెప్పారు. అంచనాలకు రెట్టింపుగా వస్తున్న యాత్రికులకు దర్శనాలు కల్పించడం కష్టసాధ్యమవుతుందని ఆలయ అధికారులు అంటున్నారు. శనివారంతో స్పర్శ దర్శనాలను పూర్తిగా నిలిపివేసి స్వామి అమ్మవార్ల అలంకార దర్శనాలకు మాత్రమే అనుమతించడంతో భక్తులందరికి స్వామిఅమ్మవార్ల దర్శించుకునేందుకు అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు. క్యూలైన్లు, కంపార్ట్మెంట్లలో వేచి ఉండే భక్తులకు అల్పాహరం, పాలు, మంచినీరు, మజ్జిగ, బిస్కెట్లు అందిస్తున్నారు.
భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్నందున ఉభయ తెలుగు రాష్ట్రాల యాత్రికులు ఉత్సవాలు ముగిసిన తరువాత స్వామి అమ్మవార్ల దర్శనాలకు రావాలని ఈవో డీ పెద్దిరాజు కోరారు. ప్రధానంగా కర్ణాటక రాష్ట్రం నుండి అధిక సంఖ్యలో యాత్రికులు వస్తుండటంతో మరో నాలుగైదు రోజుల వరకు రద్దీగానే ఉంటుందని అన్నారు. ఉగాది ఉత్సవాలు ముగిసే వరకు పలు ఆర్జితసేవా టిక్కెట్లను కూడా రద్దు చేస్తున్నట్లు తెలిపారు.