తిరుపతి : తిరుపతి శ్రీ కోదండ రామాలయంలో డిసెంబర్ నెలలో పలు విశేష ఉత్సవాలు జరుగనున్నాయి. వాటి వివరాలు ఇలా ఉన్నాయి. డిసెంబర్ 1, 28వ తేదీల్లో పునర్వసు నక్షత్రం సందర్భంగా ఉదయం 11 గంటలకు సీతారాముల కల్యాణం జరుగనుందని ఆలయ అధికారులు వెల్లడించారు. సాయంత్రం 5.30 గంటలకు స్వామి, అమ్మవారిని తిరుచ్చిపై ఆలయ నాలుగు మాడ వీధుల గుండా శ్రీరామచంద్ర పుష్కరిణి వద్దకు ఊరేగింపుగా తీసుకెళతారని , సాయంత్రం 6.30 గంటలకు ఊంజల్సేవ నిర్వహిస్తామని వివరించారు.
డిసెంబర్ 2, 9, 16, 23, 30వ తేదీల్లో శనివారం సందర్భంగా ఉదయం 6 గంటలకు శ్రీ సీతారామ లక్ష్మణుల మూలవర్లకు అభిషేకం నిర్వహిస్తామన్నారు. డిసెంబర్ 12న అమావాస్య సందర్భంగా ఉదయం 7 గంటలకు సహస్ర కలశాభిషేకం రాత్రి 7 గంటలకు హనుమంత వాహనసేవ జరుగనుందని పేర్కొన్నారు. డిసెంబర్ 26న పౌర్ణమి సందర్భంగా అష్టోత్తర శతకలశాభిషేకం, సాయంత్రం 5.30 గంటలకు ఆలయ నాలుగు మాడ వీధుల నుంచి శ్రీరామచంద్ర పుష్కరిణి వరకు తిరుచ్చి ఉత్సవం, ఆస్థానం చేపడతారని వెల్లడించారు.