అమరావతి : ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాల్లో జంగారెడ్డి గూడెం సారా మరణాలపై చర్చకు టీడీపీ
సభ్యుల పట్టు కొనసాగుతూనే ఉంది. సమావేశాలు ప్రారంభమైన నాటి నుంచి వరుసగా స్పీకర్ పోడియంను చుట్టు ముట్టి సభ్యులు ఆందోళన కొనసాగిస్తున్నారు. గురువారం కూడా అదేవిధంగా ప్రవర్తించిన సభ్యులపై స్పీకర్ తమ్మినేని సీతారాం ఆగ్రహం వ్యక్తం చేస్తూ సభ జరుగకుండా అడ్డుకుంటున్న టీడీపీ సభ్యులను ఒక్కరోజు సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు.
సభలోకి సెల్ఫోన్లకు అనుమతి లేదని స్పీకర్ రూలింగ్ ఇవ్వడంతో టీడీపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రశ్నోత్తరాల్లో సమయంలో మూడు ప్రాంతాల అభివృద్ధిపై చర్చ చేపట్టాలని వైసీపీ సభ్యులు కోరగా సభ ముగిసేలోగా విస్తృత స్థాయి ప్రత్యేక చర్చ చేపడతామని స్పీకర్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సభలో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ చంద్రబాబు ఆర్యవైశ్యులపై కపట ప్రేమను ఒలకబోస్తున్నారని విమర్శించారు. సొంత పార్టీలోని ఆర్యవైశ్య నేత శిద్దా రాఘవరావును అవమానించిన చరిత్ర చంద్రబాబుది అని ఆరోపించారు.
చంద్రబాబు, పవన్కల్యాణ్ ఆర్యవైశ్య ద్రోహులని, .రోశయ్యను చంద్రబాబు ఎన్నో ఇబ్బందులు పెట్టాడని పేర్కొన్నారు. అంబటి రాంబాబు మాట్లాడుతూ టీడీపీ సభ్యులు సభను అడ్డుకోవడమే పనిగా పెట్టుకున్నారు ఆరోపించారు.