అమరావతి : ఈ నెల 13న జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో చెలరేగిన హింసాత్మక ఘటనలపై విచారణ కోసం ఏర్పాటు చేసిన సిట్ బృందం దర్యాప్తును (SIT investigation) ముమ్మరం చేసింది. 13 మంది కూడిన బృందం సభ్యులు వీడిపోయి పల్నాడు(Palnadu), తిరుపతి(Tirupati), అనంతపురం(Anantapuram) జిల్లాలో శనివారం నుంచి విస్తృతంగా దర్యాప్తును ప్రారంభించారు. హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్న ప్రాంతాలను సందర్శించి పోలీసులు, స్థానికులు, బాధితుల వద్ద నుంచి సమాచారాన్ని సేకరించారు.
తిరుపతిలోని పద్మావతి యూనివర్సిటీనీ సిట్ సభ్యులు ఆదివారం పరిశీలించారు. ధ్వంసమైన వాహనాల వివరాలను సేకరించారు. చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని (Pulivarthi Nani) పై హత్యాయత్నం ఘటనాస్థలాన్ని పరిశీలించారు. స్ట్రాంగ్రూమ్ సమీపంలోకి ఆయుధాలు రావడంపై పోలీసులను ప్రశ్నించారు. రామిరెడ్డి, కూచివారిపల్లిలోనూ సిట్ బృందం పర్యటించింది. టీడీపీ, వైసీపీలకు చెందిన నాయకుల ఇళ్లపై దాడులు జరిగిన విషయాన్ని తెలుసుకుని వారి ఇళ్ల వద్దకు వెళ్లి ఆరా తీశారు. దాడులకు పాల్పడ్డ నిందితులపై నమోదు చేసిన కేసుల గురించి వాకాబు చేశారు.
నరసరావుపేట ఒకటో పట్టణ పోలీస్స్టేషన్ పరిధిలో అల్లర్లకు సంబంధించిన వీడియాలను సిట్ అదనపు ఎస్పీ సౌమ్యలత బృందం సభ్యులు పరిశీలించారు. ఇప్పటికే పోలీసులు పలువురిని అరెస్టు చేయగా మరి కొందరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులను గృహ నిర్బంధంలో ఉంచారు. మరికొందరిని నియోజకవర్గం నుంచి మరో ప్రాంతానికి తరలించారు.