అమరావతి: ఆంధ్రప్రదేశ్లో బీజేపీ చేపడుతున్న ఆందోళన కార్యక్రమాలతో ఏపీ ప్రభుత్వానికి వణుకుపుడుతోందని బీజేపీ ఏపీ శాఖ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. తామర పురుగుతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని గుంటూరు చుట్టగుంట కూడలి వద్ద బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో మహాధర్నాను నిర్వహించింది. ఈ సందర్భంగా ధర్నాకు బీజేపీ నాయకులు, కార్యకర్తలు, రైతులు రాకుండా గృహ నిర్బంధంతో పాటు పలువురు నాయకులను పోలీసులు అరెస్టు చేశారు.
మహాధర్నాలో పాల్గొన్న సోము వీర్రాజు మాట్లాడుతూ .. పోలీసుల చర్యను ఖండించారు. మిర్చి రైతులను ఆదుకోవడంతో ప్రభుత్వం విఫలమైందన్నారు. కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యబద్దంగా ఆందోళన చేస్తే అడ్డుకుంటారా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రభుత్వం ప్రతిపక్షాలను అణగదొక్కుతోందని మండిపడ్డారు. అధికార బలంతో ఉద్యమాలను ఆపలేరని, ధర్నాకు వెళ్లకుండా గృహనిర్బంధాలు, అరెస్టులు సరికాదని పేర్కొన్నారు. రైతుల సమస్యలు పట్టని మంత్రి తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాయలసీమ రైతులను ప్రభుత్వం విస్మరించిందని ఆయన అన్నారు.