తిరుపతి : డాలర్ శేషాద్రి మరణం నా కుటుంబానికి తీరని లోటని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. మంగళవారం తిరుపతిలో శేషాద్రి నివాసానికి వెళ్లి ఆయన పార్థివదేహం వద్ద నివాళి అర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. డాలర్ శేషాద్రి స్వామివారికి అత్యంత ప్రియమైన భక్తుడు..పుణ్యపురుషుడని అన్నారు. శేషాద్రి స్వామి స్వామివారిలో ఐక్యమయ్యారని, ఆయన మరణం నమ్మలేనటువంటి విషయంగా ఉందని పేర్కొన్నారు.
40 వ సంవత్సరాల పాటు స్వామి వారిసేవలో తరిస్తూ ఆరోగ్యాన్ని కూడా విస్మరించారని తెలిపారు. నేను గాని నా కుటుంబ సభ్యులు గాని తిరుమల స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చినప్పుడల్లా చిరునవ్వుతో ఆహ్వానం పలుకుతూ దర్శనం చేయించేవారు. ఇకపై అటువంటి ఆహ్వానం ఉండదన్న బాధ నా మనస్సును కలిచివేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.
స్వామివారికి సంబంధించిన విషయాలను, తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ప్రాచీన విషయాలను పుస్తకాలను ప్రచురించి భావితరాలకు అందించాలన్నది శేషాద్రి లక్ష్యమని, అతడి పుస్తకాలను టీటీడీ ముద్రించి భావితరాలకు అందించాలని సూచించారు.