అమరావతి : కుప్పం మున్సిపాలిటీ పరిధిలో సోమవారం జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అడ్డదారిన గెలుపొందేందుకు కుట్రలు పన్నుతుందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. స్థానికేతరులను తీసుకువచ్చి దొంగ ఓట్లు వేసేందుకు ప్రయత్నిస్తున్నారని వెంటనే స్థానికేతరులను కుప్పం నుంచి పంపించి వేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి, డీజీపీకి ఆయన లేఖలు రాశారు.
పోలీసులు సరైన రీతిలో వ్యవహరించకపోగా స్థానికేతరులను అడ్డుకుంటున్న టీడీపీ కార్యకర్తలపైనే కేసులు నమోదు చేయడం దారుణమని పేర్కొన్నారు. అనైతికంగా వ్యవహరిస్తున్న స్థానిక పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కుప్పంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై తక్షణమే చర్యలు తీసుకోని ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో జరిపించాలని లేఖలో కోరారు.