అమరావతి: ఆంధ్రప్రదేశ్లో బడి గంట మోగింది. కరోనా సెకండ్ వేవ్ విజృంభణతో మూతపడిన స్కూళ్లు, కాలేజీలు మళ్లీ తెరచుకున్నాయి. కరోనా నేపథ్యంలో గతేడాది పరీక్షలు లేకుండానే విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేసిన విషయం తెలిసిందే. కరోనా నిబంధనలను పాటిస్తూ 1-10 తరగతులు, ఇంటర్ రెండో ఏడాది వారికి సోమవారం ఉదయం తరగతులు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 61,137 ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు పాఠశాలలు తెరుచుకున్నాయి. అయితే గతంలోలా కాకుండా గదుల కొరత ఉన్న విద్యా సంస్థల్లో రెండు విడతలుగా తరగతులను నిర్వహిస్తున్నారు. 10 శాతం, అతంకంటే తక్కువగా కరోనా కేసులు ఉండే ప్రాంతాల్లో మాత్రమే బడులు తెరవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. కాగా, ఉత్తరప్రదేశ్, బీహార్లో కూడా నేటి నుంచే ప్రత్యక్ష తరగతులు ప్రారంభమయ్యాయి.