అమరావతి : తన చివరి శ్వాస వరకు కేసీఆర్తోనే ఉంటానని ఏపీ మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు స్పష్టం చేశారు. రిటైర్డ్ ఐఏఎస్ తోట చంద్రశేఖర్, మాజీ ఐఆర్ఎస్ అధికారి పార్థసారధితో కలిసి రావెల ఇవాళ హైదరాబాద్లో సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమంలో దూసుకుపోందని, కేసీఆర్ చేస్తున్న కార్యక్రమాలు తనను ఆకర్షించాయన్నారు.
ఏపీ పరిస్థితి కుక్కలు చింపిన విస్తరిలా తయారైందన్న రావెల.. టీడీపీ, వైసీపీ మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతుందని విమర్శించారు. చరిత్రలో మూడు రాజధానుల నిర్మాణం ఎక్కడా లేదని, ఏపీలో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే అద్భుతమైన రాజధాని, సెక్రటేరియట్ నిర్మిస్తామన్నారు. తోట చంద్రశేఖర్ తాను మంచి స్నేహితులమన్న రావెల.. గతంలో ఇద్దరం ఒకే పార్టీలో కలిసి పని చేశామని, ఇకపై సైతం కలిసే పని చేస్తామని చెప్పారు. గతంలో కాంగ్రెస్ పార్టీ చేసినట్లే ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీలను వేధిస్తోందని విమర్శించారు. సీబీఐ, ఈడీ, ఐటీ పేరుతో రాజకీయ పార్టీలను అణచివేయాలని చూస్తున్నారని.. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని.. దేశ ప్రజలే బీజేపీకి బుద్ధి చెబుతారన్నారు.
ఇదిలా ఉండగా.. బీఆర్ఎస్లో చేరేందుకు ఆంధ్రా సమాజం హైదరాబాద్కు కదలి వస్తున్నది. తోట చంద్రశేఖర్, రావెల కిశోర్ బాబు, పార్థసారథితో పాటు పలువురు ప్రముఖులు కేసీఆర్ సమక్షంలో చేరనుండగా.. ఈ మేరకు భారీ ఏర్పాట్లు చేశారు. నేతల చేరికల నేపథ్యంలో గుంటూరు, విజయవాడతో పాటు ఏపీలోని పలు ప్రాంతాల నుంచి అభిమానులు హైదరాబాద్కు తరలుతున్నారు. ఇప్పటికే వందలాది వాహనాలు రహదారుల వెంట బారులు తీరాయి.