అమరావతి : ఆంధ్రప్రదేశ్కు చెందిన వైసీపీ నాయకుడు, రెబెల్ ఎంపీ రఘురామకృష్ణ రాజు ఢిల్లీలో ఒకరోజు ఉపవాస దీక్షను ప్రారంభించారు. ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు రివర్స్ పీఆర్సీకి వ్యతిరేకంగా ఉద్యోగులకు సంఘీభావం తెలుపుతూ ఢిల్లీలోని తన నివాసంలో దీక్ష చేపట్టారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం రివర్స్ పీఆర్సీని ప్రకటించి ఉద్యోగుల మనోభావాలను దెబ్బతీసిందని ఆరోపించారు. సీఎం ఉద్యోగులకు అనేక హామీలు ఇచ్చారని వాటిని అమలు చేయకుండా యూటర్న్ తీసుకోవడం, రివర్స్ పీఆర్సీని వేయడం దారుణమని అన్నారు.
చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఇంటిరియం రిలీఫ్ కన్నా ఫైనల్ పిట్మెంట్ను తక్కువగా ఇవ్వడం శోచనీయమని అన్నారు. హెచ్ఆర్ఏ తగ్గింపు ,ఇతర సమస్యలపై ప్రజలంతా ముక్తకంఠంతో ఎదురు తిరగాలని, ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు జరిగిన అన్యాయాన్ని నిలదీయాలన్నారు. జగన్ ప్రభుత్వంలో సరైన నాయకులు లేరని, కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. ప్రభుత్వం ఇచ్చిన రివర్స్ జీవోలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.