అమరావతి : ఏపీ ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన పీఆర్సీ ఫిట్మెంట్తో కొన్ని వర్గాలు మినహా మిగతా వర్గాలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. పీఆర్సీపై నిరసన వ్యక్తం చేస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయులకు తోడుగా ఆర్టీసీ ఉద్యోగులు కూడా ఆందోళన బాట పట్టనున్నారు. ఆర్టీసీ సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయడంతో సంబరాలు చేసుకున్నామని, అయితే ఇప్పటి వరకు ఉన్న సౌకర్యాలను నిలుపుదల చేయడం పట్ల ఎంప్లాయీస్ యూనియన్ ఉద్యోగులు సీఎం జగన్కు బహిరంగ లేఖను రాశారు.
సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయడం వల్ల 2021లో ఒక పీఆర్సీ కోల్పోయామని ఆందోళన వ్యక్తం చేశారు. కోల్పోయిన పీఆర్సీ నష్టాన్ని భర్తీ చేయాలని ఈ సందర్భంగా వారు కోరారు. 2017 పీఆర్సీకి 2019లో 25శాతం తాత్కాలిక ఫిట్మెంట్ ఇచ్చారని, ప్రభుత్వోద్యోగులతో పాటే ఆర్టీసీ ఉద్యోగులకు కూడా ఫిట్మెంట్ ఇస్తామన్నారని గుర్తు చేశారు. ప్రభుత్వంలో విలీనం వల్ల 2021 పీఆర్సీ పెండింగ్లో ఉందని, తాజా పీఆర్సీలో తమను చేర్చకపోవడం వల్ల పీఆర్సీని నష్టపోతున్నామని లేఖలో పేర్కొన్నారు.
తమకు కూడా అదనపు ఫిట్మెంట్ బెనిఫిట్ ఇచ్చి స్కేల్స్ నిర్ణయించాలని కోరారు. విలీనం తర్వాత ఆర్టీసీ ఉద్యోగుల సౌకర్యాలు తొలగిస్తున్నారని ఆరోపించారు. ఎస్ఆర్బీఎస్, ఎస్బీటీ, గ్రాట్యుటీ సౌకర్యాన్ని తొలగించారని ఆరోపించారు. ఆర్టీసీ సిబ్బందికి వైద్య సౌకర్యాలు, నెలావారీ ఇన్సెంటివ్నూ నిలిపివేశారని పేర్కొన్నారు.