AP Elections | ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ జన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటమి ఖాయమని వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో టీడీపీ కూటమిదే విజయమైని స్పష్టం చేశారు. హైదరాబాద్లో ఓ కార్యక్రమంలో ప్రశాంత్ కిశోర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. అయితే, గతంలో ప్రశాంత్ కిశోర్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరించిన విషయం తెలిసిందే.
కార్యక్రమంలో పాల్గొన్న ప్రశాంత్ కిశోర్ మాట్లాడుతూ ప్యాలెస్లో కూర్చొని పథకాల పేరుతో డబ్బులిస్తే ఓట్లు పడవన్నారు. సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి సైతం కీలకమన్నారు. ఉచిత పథకాలు మాత్రమే అధికారాన్ని తీసుకురావన్న ప్రశాంత్ కిశోర్.. ఓటేసే ముందు జనం అభివృద్ధి సైతం పరిగణలోకి తీసుకుంటారన్నారు. అయితే, ఈ విషయంలో వైఎస్ జగన్ పెద్ద తప్పే చేశారన్నారు. ఈ తప్పులే ఓటమికి దారితీస్తాయన్నారు. ప్రజల డబ్బునే ఖర్చు పెడుతూ.. ప్రజలను కాపాడుతున్నట్లుగా మాట్లాడడం ఏమాత్రం సరికాదన్నారు.
తాను ఏపీలో గెలుపోటములపై ఈ వ్యాఖ్యలు చేయడం లేదన్న ఆయన.. గతంలో అక్కడ పని చేసిన నేపథ్యంలో తాజా రాజకీయ పరిణామాలను దృష్టిలో పెట్టుకొని ఈ వ్యాఖ్యలు చేసినట్లు పేర్కొన్నారు. ఏపీ అభివృద్ధి విషయంలో జగన్ సరైన నిర్ణయాలు తీసుకోలేకపోయారని అభిప్రాయపడ్డారు. కొందరు సలహాలు, సూచనలే జగన్ తీసుకుంటున్నారని.. అది రాబోయే ఎన్నికల్లో ముప్పుగా మారబోతుందంటూ హెచ్చరించారు. కొందరు వ్యక్తుల చేతుల్లోనే ప్రభుత్వం ఉందనే అపోహలు సైతం ఉన్నాయని.. ఈ తరుణంలో ఓటమి ఎదురవనుందని పేర్కొన్నారు. ప్రజలు ఈ సారి మార్పును కోరుకుంటున్నారని.. దాంతో పాటు పరిపాలపై జగన్కు అవగాహన లోపం సైతం ఉందని చెప్పారు.