Srisailam | శ్రీశైల మహాక్షేత్రంలో వైభవంగా జరిగే కార్తీక మాసోత్సవాలకు యాత్రికులు.. దేవస్థానం అధికారులు, సిబ్బందికి సహకరించాలని ఈవో లవన్న కోరారు. కార్తీక మాసోత్సవాలకు వచ్చే యాత్రికుల వాహన పార్కింగ్ సమస్యలను అధిగమించేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. సోమవారం ఆయన ఇంజనీరింగ్ అధికారులతో కలిసి క్షేత్ర పరిధిలోని ప్రధాన పార్కింగ్ స్థలాలను పరిశీలించారు. అలాగే ఆర్టీసీ బస్టాండ్, ప్రభుత్వ పాఠశాల ఆవరణ, ఘంటామఠం ప్రాంతం, టూరిస్ట్ బస్టాండ్తోపాటు వలయ రహదారిపై కూడా వాహనాల పార్కింగ్కు ఏర్పాట్లు చేస్తామని చెప్పారు.
ఆలయ పరిసరాలలో సుమారు 100 ఎకరాల ఖాళీ స్థలాల్లో వాహనాల పార్కింగ్కు వీలుగా చేస్తున్న ఏర్పాట్లను వినియోగించుకుని ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా యాత్రికులు సహకరించాలని లవన్న కోరారు. ఆలయ దర్శనానికి వచ్చే భక్తులకు మార్గదర్శకాలతోపాటు అందరికి అర్థమయ్యేలా వివిధ భాషల్లో సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
క్షేత్ర పరిధిలో గల నిత్యాన్నదాన సత్రాలలో బస చేసేందుకు వచ్చే వాహనాలను పురవీధుల రోడ్లపై పార్కింగ్ చేసేందుకు అనుమతిలేదని ఈవో లవన్న హెచ్చరించారు. భక్తుల రద్దీ రోజుల్లో కాలినడకతో తిరిగే వారికి ఇబ్బందులు కలిగించవద్దని సూచించారు. ఈ విషయమై క్షేత్ర పరిధిలో సుమారు 60కిపైగా గల నిత్యాన్న సత్రాల నిర్వాహకులకు కూడా పలు మార్లు వివరించినట్లు తెలిపారు. అత్యవసరాల కోసం సత్రాల ప్రాంగణంలో మాత్రమే వాహనాలను పార్కింగ్ చేయాలని చెప్పారు.