తిరుమల : తిరుమలలో స్వామివారిని దర్శించుకునేందుకు వాహనాల్లో వచ్చే భక్తుల కోసం రేపటి నుంచి లింక్ రోడ్డు ద్వారా అనుమతి ఇవ్వనున్నామని టీటీడీ అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి వెల్లడించారు. రెండో ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడిన నేపథ్యంలో తిరుపతి – తిరుమల మధ్య వాహనాల్లో ప్రయాణించేందుకు ఎక్కువ సమయం పడుతోందని, ఈ ఆలస్యాన్ని తగ్గించేందుకు లింకు రోడ్డు ద్వారా వాహనాలను అనుమతిస్తామని తెలిపారు. శుక్రవారం కొండచరియలు విరిగిపడిన ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు.
కొండ చరియల వల్ల అప్ ఘాట్ రోడ్డులో చివరి మలుపు వద్ద పెద్ద బండరాళ్లు ఊడి పడ్డాయని, ఈ కారణంగా 3 రోడ్లకు పూర్తిగా నష్టం వాటిల్లిందని తెలిపారు. ఈ ప్రాంతాన్ని ఢిల్లీ ఐఐటీ ప్రొఫెసర్లు క్షుణ్ణంగా అధ్యయనం చేసి వారి సూచనల మేరకు వాహనాలను అనుమతిస్తున్నామని చెప్పారు. కొండచరియలు విరిగిన ప్రాంతంలో పునరుద్ధరణ పనులు పూర్తి చేసే విషయంపై ఐఐటీ నిపుణులు, ఇంజినీరింగ్ అధికారులతో టీటీడీ చైర్మన్ శుక్రవారం సమావేశం నిర్వహించారని తెలిపారు.
పునరుద్ధరణ పనులు పూర్తి చేసేందుకు నెల సమయం పడుతుందని నిపుణులు సూచించారని, ఇందుకోసం ఎంతో నైపుణ్యం ఉన్న ఆఫ్కాన్ సంస్థకు బాధ్యతలు అప్పగించామని అన్నారు. ఆయన వెంట సీవీఎస్వో గోపీనాథ్ జెట్టి, చీఫ్ ఇంజినీర్ నాగేశ్వర రావు, ఢిల్లీ ఐఐటీ నిపుణులు కె.ఎస్.రావు, ఎస్ఇ-2 జగదీశ్వర్ రెడ్డి, విజివో బాలిరెడ్డి, ఈఈ సురేంద్రారెడ్డి, ఆఫ్కాన్ సంస్థ ఇంజినీరింగ్ నిపుణులు ఉన్నారు.