అమరావతి : గుంటూరు మెడికల్ కళాశాలలో ర్యాగింగ్పై కళాశాల ప్రిన్సిపాల్ పద్మావతి స్పందించారు. ఈ నెల 16న అబ్బాయిల వసతిగృహంలో ఘటన జరిగినట్లు ఫిర్యాదు అందిందని తెలిపారు. యాంటీ ర్యాగింగ్ విభాగానికి ఫిర్యాదు రాగానే కమిటీ అప్రమత్తమైందని వివరించారు. సీనియర్ విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇవ్వగా ర్యాగింగ్ చేయలేదని చెబుతున్నారని ఆమె పేర్కొన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులతో కూడా మాట్లాడినట్లు ఆమె తెలిపారు. విద్యార్థులకు యాంటీ ర్యాగింగ్ సెల్ నంబర్లు ఇచ్చామని , మెస్లో సీనియర్లు, జూనియర్లు కలవకుండా చర్యలు తీసుకున్నామని ఆమె స్పష్టం చేశారు.
కళాశాలకు చెందిన ఓ విద్యార్థి జాతీయ కమిషన్కు చేసిన ఫిర్యాదుతో గుంటూరు వైద్య కళాశాలలో ర్యాగింగ్ జరిగినట్లు వెలుగులోకి వచ్చింది. కళాశాలలో పొడుగు చేతుల చొక్కానే వేసుకోవాలని సీనియర్లు హెచ్చరికలు జారీ చేశారని జాతీయ మెడికల్ కమిషన్కు విద్యార్థి ఫిర్యాదు చేశాడు. స్పందించిన కమిషన్ ఫిర్యాదు చేసిన విద్యార్థి వివరాలు గోప్యంగా ఉంచుతూ గుంటూరు వైద్య కళాశాల ప్రిన్సిపల్ను వివరణ కోరింది.