శ్రీశైలం : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శ్రీశైలంలో పర్యటించనున్నారు. స్వామిఅమ్మవార్లను దర్శించుకోవడంతో పాటు పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి పర్యటనను అధికారులు సమన్వయంతో పని చేసి విజయవంతం చేయాలని నంద్యాల కలెక్టర్ మునజీర్ జిలానీ సామూన్ ఆదేశించారు. బుధవారం క్షేత్రానికి వచ్చిన కలెక్టర్ స్వామిఅమ్మవార్లను దర్శించుకుని ఈ నెల 26న రాష్ట్రపతి పర్యటన సందర్భంగా ఏర్పాట్లను పరిశీలించారు. ఆ తర్వాత ఆలయ కంట్రోల్ రూంలో సమీక్ష నిర్వహించారు. క్షేత్రంలోని నంది సర్కిల్ వద్ద టూరిజం ఫెసిలిటేషన్ భవనంలో రూ.43 కోట్ల అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి ఏర్పాట్లను నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని టూరిజం డైరెక్టర్ ఈశ్వరయ్యను ఆదేశించారు.
సున్నిపెంటలోని హెలిప్యాడ్ వద్ద ఒకేసారి మూడు హెలికాప్టర్లు సిద్ధం అయ్యేలా సిద్ధం చేసి.. ట్రయల్ నిర్వహించనున్నట్లు చెప్పారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని, అవసరమైతే జనరేటర్లను ఏర్పాటు చేయాలని ఏపీసీపీడీసీఎల్ అధికారులకు సూచించారు. ఆలయ ప్రధాన గోపురం నుంచి సాంప్రదాయం ప్రకారం.. పూర్ణకుంభ స్వాగతంతో పలకాలని, భ్రమరాంబ మల్లికార్జున స్వామిఅమ్మవార్ల ప్రత్యేక దర్శనాలు ఏర్పాటు చెయ్యాలని ఈవో లవన్నను ఆదేశించారు. భద్రతా ఏర్పాట్లపై జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్పీని ఆదేశించారు. ఆలయ దర్శనానంతరం శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని కూడా సందర్శించనున్నట్లు కలెక్టర్ వివరించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ నిశాంతి, దేవస్థాన ట్రస్ట్బోర్డ్ చైర్మన్ చక్రపాణిరెడ్డి, ఆర్డీవోలు శ్రీనివాసులు, వెంకట్రెడ్డి, ఎం దాసు, స్థానిక పోలీస్ ఇన్స్పెక్టర్ దివాకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.