తిరుమల : స్వామివారిని దర్శించుకునేందుకు తిరుమల కొండకు వచ్చే భక్తులకు ఆధునిక సౌకర్యాలతో కూడిన గదుల నిర్మాణపనులను చేపట్టినట్లు టీటీడీ అదనపు ఈవో ఏ.వి.ధర్మారెడ్డి తెలిపారు. తిరుమలలోని గోకులం విశ్రాంతి భవనం ప్రాంగణంలో 73వ గణతంత్ర వేడుకల్లో పాల్గొని జాతీయ జెండాను ఎగురవేసి జెండా వందనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1980వ సంవత్సరం తరువాత తిరుమలలో పెద్దఎత్తున గదుల ఆధునీకరణ చేపట్టినట్లు వెల్లడించారు. ఇందులో భాగంగా ఇప్పటికే 2 వేల వసతి గదుల ఆధునీకరణ పనులు పూర్తి చేశామని, త్వరలో మరో 1500 గదుల ఆధునీకరణ పనులు పూర్తి చేసి భక్తులకు అందుబాటులోకి తెస్తామని చెప్పారు.
శ్రీవారి ఆలయంలో భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించేందుకు అత్యాధునిక పరకామణి భవనాన్ని జూన్ నాటికి అందుబాటులోకి తెస్తామన్నారు. దాతల సహకారంతో రూ.25 కోట్లతో అలిపిరి నడక మార్గం పైకప్పు నిర్మాణ పనులు పూర్తి చేసి గత ఏడాది అక్టోబరు నుంచి అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు.
నేటి యువతకు సనాతన హైందవ ధర్మాన్ని, ఆర్ష ధర్మ సాంప్రదాయాలను తెలిపేందుకు టీటీడీ అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు వివరించారు.ఈ కార్యక్రమంలో ఎస్ఇ-2 జగదీశ్వర్ రెడ్డి, ఆరోగ్యశాఖాధికారి శ్రీదేవి, డిప్యూటీ ఈవోలు సెల్వం, లోకనాథం, భాస్కర్, ఎస్టేట్ అధికారి మల్లిఖార్జున్, వీజివో బాలిరెడ్డి, అధికారులు పాల్గొన్నారు.