Minister Srinivas Yadav | వైజాగ్ (Vizag) స్టీల్ ప్లాంట్ (Steel plant)ను ప్రైవేటుపరం చేసేందుకు కేంద్రం కుట్రలు పన్నుతోందని, ఆ ఆలోచనను మానుకోవాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Minister Srinivas Yadav ) సూచించారు. ఆదివారం విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ సభ్యులు మంత్రి శ్రీనివాస్ యాదవ్ను వెస్ట్ మారేడ్పల్లిలోని నివాసంలో కలిసి వినతిపత్రం అందజేశారు. తాము చేస్తున్న పోరాటానికి మద్దతు తెలపాలని మంత్రిని కోరారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ కేంద్రంలోని మోదీ ప్రభుత్వం లాభాల్లో ఉన్న అన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్పరం చేస్తూ లక్షలాది మంది బతుకులను రోడ్డున పడేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎంతోమంది పోరాటాలు, త్యాగాల ఫలితంగా ఏర్పాటైన విశాఖ ఉక్కు పరిశ్రమకు కేంద్ర ప్రభుత్వం రుణ సౌకర్యం కల్పించకుండా, రా మెటీరియల్ సరఫరా చేయకుండా పరిశ్రమను నష్టాల్లోకి తీసుకెళ్లి.. ప్రైవేట్ పరం లేదంటే.. తన కార్పోరేట్ అనుచరుల పరం చేసేందుకు కుట్రలు చేస్తోందని విమర్శించారు. 780 రోజుల నుంచి తెలుగు రాష్ట్రాల ప్రజలు, ప్రభుత్వాలు వ్యతిరేకిస్తున్నా, పోరాటాలు చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడం దుర్మార్గం అన్నారు. మంత్రిని కలిసిన వారిలో పరిరక్షణ కమిటీ సభ్యులు రాజ, శివ, శ్రీరామ్, సునీల్, మురళి, హరీశ్ తదితరులు ఉన్నారు.