Michaung Cyclone | హైదరాబాద్ : బంగాళాఖాతంలో ఏర్పడిన మిగ్జాం తుఫాను వాయుగుండంగా బలహీనపడింది. ఈ వాయుగుండం బుధవారం మధ్యాహ్నం అల్పపీడనంగా మారింది. మిగ్జాం ప్రభావంతో ఏపీలో వర్షాలు కురుస్తున్నాయి. మరో 24 గంటల పాటు కోస్తాంధ్ర, రాయలసీమతో పాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురువనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్లో మిగ్జాం తుఫాను బీభత్సం సృష్టించింది. తుఫాను ప్రభావంతో పలు ప్రాంతాల్లో గత రెండు రోజులుగా ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. అల్లూరి సీతారామారాజు జిల్లా ముంచంగిపుట్టు మండలం పరదానిపుట్టు వంతెనపై వరదనీరు భారీగా ప్రవహిస్తోంది. దీంతో 50 గ్రామాల ప్రజల రాకపోకలకు అడ్డంకిగా మారింది. భారీ వర్షాలు, ఈదురుగాలులకు బాపట్ల జిల్లా చినగంజాం, మర్టూరు, యద్దనపూడి మండలాల్లో మంగళవారం మధ్యాహ్నం నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. తుఫాను దెబ్బకు నెల్లూరు డివిజన్ పరిధిలో 250 కిమీ, కావలి డివిజన్లో 170 కిమీ మేర ఆర్అండ్బీ రహదార్లు దెబ్బతిన్నాయి. రికార్డుస్థాయిలో కురిసిన వర్షాలు, 80-110 కిమీ వేగంతో వీచిన ఈదురు గాలులతో ఏపీలోని పట్టణాలు, పల్లెలు చిగురుటాకుల్లా వణికిపోయాయి.భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. ప్రధాన రోడ్లపై మోకాళ్ల లోతుకు పైగా నీళ్లు ఉండడంతో చాలా ప్రాంతాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. చాలా చోట్ల పంట పొలాల్లోంచి వరదనీరు వెళ్తోంది. దీంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
మిగ్జాం తీవ్ర తుఫాను ప్రభావంతో ఖమ్మం, కొత్తగూడెం, వరంగల్ జిల్లాల్లో ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షం కారణంగా పలు మండలాల్లో వరి, పత్తి, మొక్కజొన్న, మిరప, వేరుశనగ పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఖమ్మం, భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాలోని దాదాపు అన్ని మండలాల్లో తుఫాను ప్రభావంతో చేతికొచ్చే దశలో ఉన్న వరి పంట వర్షపు నీటిలో మునిగిపోయాయి. ఒకవైపు పంట కోతలు పూర్తయి కల్లాలు, రహదారుల పక్కన ఆరబోసిన ధాన్యం రాశులు వర్షపు నీటిలో తడిసి ముద్దయ్యాయి. ఖమ్మం, పాలేరు, వైరా, సత్తుపల్లి, అశ్వారావుపేట, ఇల్లందు, పినపాక నియోజకవర్గాల్లో దాదాపు అన్ని పంటలు వర్షాలతో దెబ్బతిన్నాయి. ప్రధానంగా పత్తి, మిర్చి పైర్లన్నీ వర్షపు నీటిలో తడిసిముద్దయ్యాయి. రెండు రోజులుగా కురుస్తున్న వర్షానికి నేలకొండపల్లి మండలం చెరువు మాదారంలో ఓ ఇంటి పైకప్పు కూలి భార్యాభర్తలు ఇద్దరు మృతి చెందారు. అశ్వాపురం మండలం భీమవరంలో వర్షం, చలి కారణంగా 40 గొర్రెలు మృత్యువాత పడ్డాయి.