హైదరాబాద్ : ముస్లిముల పవిత్ర రంజాన్ పండుగ నాటికి మక్కా మసీదు మరమ్మతు పనులు పూర్తి చేయాలని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్ లోని తన ఛాంబర్ లో క్రిస్టియన్,మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులతో పలు అంశాలను చర్చించారు.
మక్కామసీదు, జామియానిజామియా, అనిగుల్ గుర్భా మరమ్మతు, పునరుద్ధరణ పనులు పూర్తి చేయాలని సూచించారు. ఫిబ్రవరి 15 వ తేదీలోగా క్రిస్టియన్ భవన్ టెండర్లు పూర్తి చేయాలని తెలిపారు. పది కోట్లతో క్రిస్టియన్ భవన్ కోసం ఉప్పల్ బాగాయత్ లో శంకుస్థాపన చేసుకున్నామని వివరించారు. ఇతర దేశాల్లో ఉన్న మాదిరిగా మోడల్ క్రిస్టియన్ భవన్ నిర్మాణం చేపట్టాలని సూచించారు. ఈ ఆర్థిక సంవత్సరం పూర్తయ్యేలోగా టెండర్లు పిలువాలని వెల్లడించారు.
మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ రుణాల కోసం రెండు లక్షల దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు మంత్రికి వివరించారు. ఈ సమావేశం లో ప్రభుత్వ సలహాదారు ఎకే. ఖాన్, వక్ఫ్ బోర్డు చైర్మన్ మసి ఉల్లాఖాన్, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఇంతి యాజ్ ఇషాక్, మైనార్టీ శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ అహ్మద్ నదీమ్,
ఎండీ కాంతి వెస్లీ, డైరెక్టర్ షఫీఫుల్లాఖాన్ తదితరులు పాల్గొన్నారు.