Lovers Suicide | కర్నూల్ : వారిద్దరూ చిన్నపట్నుంచి కలిసి చదువుకున్నారు. ప్రేమలో పడ్డారు. ఏమైందో తెలియదు కానీ.. ఇద్దరూ కలిసే చనిపోయారు. ఈ విషాద ఘటన కర్నూల్ జిల్లాలోని మంత్రాలయంలో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. మంత్రాలయానికి చెందిన టీస్టాల్ నిర్వాహకుడు ఆంజనేయులు, జయమ్మ దంపతుల పెద్ద కుమార్తె మేకల నందిని (20) కర్నూల్లో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఉగాది ఉండటంతో రెండు రోజుల క్రితం స్వగ్రామానికి వచ్చింది. కాగా.. మంత్రాలయం మండలం రచ్చుమర్రికి చెందిన చిన్నగోవిందు కుమారుడు చిన్నవెంకటేశులు(22) ఇంటర్మీడియట్ వరకు చదువుకుని పొలం పనులు చేసుకుంటున్నాడు.
చిన్నవెంకటేశు, నందినిలు ఒకే పాఠశాలలో చదువుకున్నారు. ఈ క్రమంలోనే ఒకరినొకరు ప్రేమించుకున్నారు. నందిని ఆదివారం అర్ధరాత్రి తర్వాత ఇంట్లో కనిపించకపోవడంతో ఎంత వెతికినా ఫలితం లేకపోయింది. చివరకు మంత్రాలయం- మటుమర్రి రైల్వేస్టేషన్ల మధ్య ఉన్న టీబీ వంతెన వద్ద రైలు కిందపడి ప్రేమికులిద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు. అయితే ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారనే వివరాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.