అమరావతి : ప్రభుత్వ నిబంధనలతో ఆర్థిక ఇబ్బందులను తట్టుకోలేక కారుణ్య మరణాలకు అనుమతి ఇవ్వాలని ఏపీకి చెందిన తాడేపల్లి పరిధిలోని రైతులు ఏపీ గవర్నర్కు పోస్టు కార్డులు రాయడం సంచలనం కలిగిస్తోంది. రాజధాని అమరావతి కోసం తాడేపల్లి పరిధిలోని అమరానగర్కు చెందిన 178 ఎకరాలను ప్రభుత్వం యూ-1 జోన్ కిందకు తీసుకువచ్చారు. ఈ భూముల్లో ఎలాంటి క్రయవిక్రయాలు, రిజిస్ట్రేషన్లు జరగకుండా నిషేధం విధించారు.
ఈ జోన్ను తొలగించాలని అప్పటి ప్రభుత్వ హయం నుంచి ఈ ప్రాంత రైతులు ఆందోళన నిర్వహిస్తున్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వైసీపీ ప్రభుత్వం యూ-1 జోన్ తొలగించడంలో చేస్తున్న జాప్యం వల్ల ఎదురవుతున్న ఆర్థిక ఇబ్బందులను తట్టుకోలేకపోతున్నామని రైతులు వాపోతున్నారు. యూ-1 జోన్ తొలగించాలని తాడేపల్లిలో 13 రోజులుగా రైతులు రిలే దీక్షలు చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో రైతులు తాజాగా గవర్నర్కు పోస్టుకార్డులు రాసి తమ ఆవేదనను తెలియజేశారు.
2019 ఎన్నికల సమయంలో అధికారంలోకి వస్తే యూ-1 జోన్ ఎత్తివేస్తామని వైసీపీ నేతలు ఇచ్చిన హామీపై ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సమక్షంలో ముఖ్యమంత్రి జగన్ను సైతం కలిసి విన్నవించారు. 2 నెలల్లో ఎత్తివేస్తామని ఇచ్చిన హామీ నెరవేర్చలేదని, జాతీయ రహదారి సమీపంలో ఉన్న తమ భూములను అవసరాల కోసం అమ్ముకోలేకపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
andhra pradesh, governor, farmers, post cards