Srisailam Temple | శ్రీశైలం : జ్యోతిర్లింగం, శక్తిపీఠ క్షేత్రమైన శ్రీశైల భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి క్షేత్రంలో అక్టోబర్ 22 నుంచి కార్తీకమాసం ఉత్సవాలు వైభవంగా ప్రారంభం కానున్నాయి. ఉత్సవాలు నవంబర్ 21 వరకు జరుగనున్నాయి. ఈ సందర్భంగా ఉత్సవాల ఏర్పాట్లపై ఆలయ అధికారులతో ఈవో శ్రీనివాసరావు సమావేశం నిర్వహించారు. సమావేశంలో భక్తులకు వసతి, మంచినీటి వసతి, దర్శనాలు, ఆలయ వేళలు, స్వామి అమ్మవార్లకు నిర్వహించాల్సిన ఆర్జిత సేవలు సహా పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రతి కార్తీక సోమవారం, శుక్రవారం కృష్ణమ్మకు హారతి, శుద్ధ ఏకాదశి రోజున కోటి దీపోత్సవం, లక్ష దీపోత్సవం, పుష్కరిణి హారతి, కార్తీక పౌర్ణమి సందర్భంగా జ్వాలాతోరణం, పుణ్యనదీ హారతి ఏర్పాట్లు, కార్తీక మాసంలో ఆకాశ దీపం, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ తదితర అంశాలపై చర్చించి.. అధికారులకు పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ ఉత్సవాలకు ముందే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ముందే అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆయా విభాగాలను ఆదేశించారు. అక్టోబర్ 15 వరకే ఏర్పాట్లన్నీ పూర్తవ్వాలని చెప్పారు. ఉత్సవాల్లో ప్రతీ కార్తీక సోమవారాలు, కార్తీక పౌర్ణమి, ఏకాదశితో పాటు ప్రభుత్వ సెలవుల్లో భక్తుల రద్దీ అధికంగా ఉంటుందని అంచనా వేశారు. ఈ మేరకు ఆయా రోజుల్లో పకడ్బందీ చర్యలు చేపట్టాలన్నారు. పాతాళగంగ వద్ద శౌచాలయాలు, దుస్తులు మార్చుకునే గదులతో పాటు మెట్ల మార్గంలో అవసరమైన చోట్ల మరమ్మతులు చేపట్టాలని.. గంగాభవానీ స్నానఘట్టాల వద్ద సైతం మరమ్మతులు చేయించాలని సూచించారు.
కార్తీక మాసోత్సవాల నేపథ్యంలో వేకువ జామున 3గంటలకే ఆలయ ద్వారాలు తెరువనున్నారు. ప్రాతఃకాల పూజల అనంతరం 4.30 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు భక్తులకు దర్శనాలు కల్పించనున్నారు. తిరిగి సాయంత్రం 5.30 గంటలకు రాత్రి 10.30 గంటల వరకు దర్శనాలు ఉంటాయని ఈవో శ్రీనివాసరావు తెలిపారు. ఉత్సవాల సందర్భంగా ఆర్జిత సేవలన్నీ నిలిపివేస్తున్నట్లు చెప్పారు. గర్భాలయ అభిషేకాలను సైతం నిలిపివేయనున్నట్లు పేర్కొన్నారు. సామాన్య భక్తులకు దర్శనం కల్పించేందుకు వీలుగా కార్తీక శని, ఆది, సోమవారాలు, పౌర్ణమి సహా 15 రోజులు సామూహిక అభిషేకాలను నిలిపివేయనున్నట్లు తెలిపారు. సాధారణ రోజుల్లో అభిషేకాలు సైతం పరిమితంగానే నిర్వహిస్తామన్నారు. అలాగే, అన్నప్రసాద వితరణ భవనంలో ఉదయం 10.45 గంటల నుంచి అన్నదాన ప్రసాదం పంపిణీ ఉంటుందన్నారు. సాయంత్రం 7 గంటల నుంచి అల్పహారం అందుబాటులో ఉంటుందన్నారు. క్లూకాంప్లెక్స్లో భక్తులకు మంచినీరు, బిస్కెట్లు, అల్పాహారం పంపిణీ చేయనున్నట్లు వివరించారు.
కార్తీక మాసంలో భక్తుల రద్దీకి అనుగుణంగా అవసరమైన లడ్డూ ప్రసాదం సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అదనంగా విక్రయ కౌంటర్లు ఏర్పాటు చేస్తామన్నారు. మొత్తం పది కౌంటర్ల ద్వారా ప్రసాదాలు విక్రయించనున్నట్లు పేర్కొన్నారు. కార్తీక మాసంలో భక్తులు పుణ్య స్నానాలు చేసేందుకు ప్రాధాన్యం ఇవ్వనున్న నేపథ్యంలో పాతాళగంగ వద్ద అవసరమైన ఏర్పాట్లు చేస్తామన్నారు. అదనంగా లైటింగ్ ఏర్పాటు చేస్తామని వివరించారు. భక్తుల భద్రత కోసం పాతాళగంగ వద్ద గజ ఈతగాళ్లను మోహరించనున్నట్లు చెప్పారు. ఉత్సవాలకు వచ్చే భక్తుల కోసం అవసరమైన చోట్ల సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. ఉత్సవాల సమయంలో అఖండ శివభజనలు నిర్వహిస్తామని.. కార్తీకదీపారాధన చేసుకునేందుకు వీలుగా ఆలయ ఉత్తర మాడవీధిలో ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయనున్నట్లు వివరించారు. గంగాధరమండపం వద్ద కూడా సైతం ఏర్పాట్లు ఉంటాయన్నారు. నవంబర్ 24న, కార్తీక పౌర్ణమి రోజున కృష్ణమ్మ నదీహారతి కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. విశేష పూజలు చేసి.. సారె సమర్పిస్తామన్నారు.
కార్తీక శుద్ధ ఏకాదశి రోజున గంగాధర మండపం వద్ద కోటి దీపోత్సవం నిర్వహించనున్నట్లు వివరించారు. గంగాధర మండపం నుంచి నందిమండపం వరకు ప్రత్యేకంగా ఏర్పాట్లు ఉంటాయన్నారు. కార్తీకసోమవారాలు, పౌర్ణమి రోజున ఆలయ పుష్కరిణి వద్ద లక్షదీపోత్సవం, పుష్కరిణి హారతి కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. గంగాధరమండపం వద్ద జ్వాలాతోరణ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. ఉత్సవాలు జరిగే నెల రోజుల పాటు ఆలయ కళావేదిక వద్ద ప్రతిరోజు ధార్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. లక్ష దీపోత్సవం, పుష్కరిణి హారతి రోజులలో పుష్కరిణి వద్ద కార్యక్రమాలు ఏర్పాటు చేయన్నట్లు తెలిపారు. సమావేశంలో డిప్యూటీ ఈవో ఆర్ రమణమ్మ, ప్రధాన అర్చకులు, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు, ఆయా విభాగాల అధికారులు పాల్గొన్నారు.