Srisailam | శ్రీశైల మహా క్షేత్రానికి ఉగాది ఉత్సవాల సందర్బంగా కర్ణాటక, మహారాష్ట్రలతోపాటు ఉభయ తెలుగు రాష్ట్రాల నుండి కాలినడకన అధిక సంఖ్యలో భక్తులు చేరుకుంటుండటంతో క్షేత్ర పురవీధులు కిటకిటలాడుతున్నాయి. ఉగాది ఉత్సవాలల్లో భాగంగా లింగ దర్శనం ఉండదని కేవలం అలంకార దర్శనం మాత్రమే ఉంటుందని ఈవో డీ పెద్ది రాజు తెలిపారు.
దేవస్థానం అనుమతులతో పలు స్వఛ్చందసేవా సంఘాల ఆధ్వర్యంలో కాలినడక భక్తులకు మార్గమధ్యలో అన్నదానాలు, మంచినీరు అందిస్తున్నారు. ఉభయ దేవాలయాల్లో స్వామి అమ్మవార్లను దర్శించుకునేందుకు సుమారు ఆరు గంటల సమయం పడుతుందని ఆలయ అధికారులు చెప్పారు. రోజురోజుకు పెరుగుతున్న భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ జిల్లా రెవెన్యూ, దేవస్థాన అధికారులు అప్రమత్తమవుతున్నారు. అటవీ ప్రాంతం నుండి కాలినడకతో వచ్చే వారికి వైద్య సేవలు అందించేందుకు దేవస్థానం దవాఖానలో పూర్తి ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
సుదూర ప్రాంతాల నుండి కాలినడకన వచ్చే యాత్రికులకు సౌకర్యవంతంగా ఉండేలా చేసిన చలువ పందిళ్లు, క్యూలైన్లు, లడ్డూ ప్రసాదాలు, అన్నదాన వితరణ వసతులను పూర్తిగా సద్వినియోగపరుచుకోవాలని ఈఓ డీ పెద్ది రాజు కోరారు. అదే విధంగా కైలాసద్వారం, హఠకేశ్వరం, సాక్షిగణపతి ఆలయాలతోపాటు వివిధ ప్రాంతాలలో స్వఛ్చంద సంస్థల ప్రతినిధులకు, శివసేవకులకు కూడా సహకరించాలని అన్నారు.