అమరావతి: ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీకి (బీజేపీ) భారీ ఎదురుదెబ్బ తగిలింది. సీనియర్ నేత, మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు పంపారు. గుంటూరులోని తన నివాసంలో తన అనుచరులతో సమావేశమయ్యారు. తాను పార్టీలో ఇమడలేకపోతున్నాని, అందుకే రాజీనామా చేస్తున్నాని ప్రకటించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆయన పార్టీని తన సొంత సంస్థలా నడుపుతున్నారని విమర్శించారు. సోము వీర్రాజు అధ్యక్షుడైన తర్వాత బీజేపీలో పరిస్థితులు మారాయన్నారు. పార్టీ నాయకత్వం సరిగా లేనందువల్లే రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. పార్టీతో చర్చించకుండా రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ సొంతంగా వ్యవహరిస్తున్నారని చెప్పారు.
2014లో ప్రధాని మోదీ నాయకత్వంపై ఆకర్షితుడినై బీజేపీలో చేరానని వెల్లడించారు. నాలుగేండ్లపాటు సామన్య కార్యకర్తలా పార్టీలో పనిచేశానని చెప్పారు. 2018లో పార్టీ అధ్యక్షుడిగా నియమించారని తెలిపారు. తన పనితీరు నచ్చే చాలామంది బీజేపీలో చేరరని పేర్కొన్నారు. అమరావతి ఉద్యమానికి పూర్తి మద్దతు ప్రకటించామన్నారు. కృష్ణా జిల్లాకు రంగా పేరు పెట్టాలని ప్రభుత్వాన్ని కోరామని తెలిపారు. అయితే సోము వీర్రాజు అధ్యక్షుడైన తర్వాత పార్టీలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. త్వరలో తన భవిత్ కార్యాచరణను ప్రకటిస్తానన్నారు. కన్నాతోపాటు మరో 15 మంది నాయకులు పార్టీ నుంచి తప్పుకున్నారు.
గత దశాబ్ద కాలంగా కన్నా లక్ష్మినారాయణ గుంటూరు జిల్లా రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలంపాటు కొనసాగిన ఆయన ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. పల్నాడు జిల్లా పెదకూరపాడు నుంచి 4 సార్లు, గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి ఓసారి ఎమ్మెల్యేగా పనిచేశారు. సుమారు 15 ఏండ్లు మంత్రిగా పనిచేశారు. అయితే రాష్ట్ర విభజన అనంతరం ఆయన బీజేపీలో చేరారు. 2018లో పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. కాగా, చాలా కాలంగా ఆయన పార్టీ మీద అసంతృప్తితో ఉన్నారు. గత కొన్ని నెలలుగా ఆయన పార్టీ మారుతారని విస్తృతంగా ప్రచారం జరుగుతున్నది.