NTR Fan Shyam | జూనియర్ ఎన్టీఆర్ వీరాభిమాని శ్యామ్ అనుమానాస్పద మృతి రాజకీయరంగు పులుముకుంది. శ్యామ్ మరణం వెనుక స్థానిక వైసీపీ నేతలు ఉన్నారంటూ టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించడం ఇప్పుడు ఆంధ్రాలో సంచలనంగా మారింది. తెలుగుదేశం పార్టీ చేసిన ఆరోపణలపై వైసీపీ కూడా అంతే దీటుగా స్పందించింది. ఈ ఘటనను రాజకీయంగా వాడుకోవాలని చూడటం చాలా బాధాకరమని టీడీపీ నేతల ప్రచారాన్ని వైసీపీ ఖండించింది. ఇలాంటి నీచ రాజకీయ నాయకులు చేసే విష ప్రచారాల నుంచి రాష్ట్ర ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని పిలుపునిచ్చింది.
తూర్పు గోదావరి జిల్లాకు చెందిన శ్యామ్ ( 23) జూనియర్ ఎన్టీఆర్కు వీరాభిమాని. ఇటీవల చింతలూరు గ్రామానికి వెళ్లిన శ్యామ్.. అనుమానాస్పదంగా మృతిచెందాడు. ఈ నెల 25న అతను బలవన్మరణానికి పాల్పడినట్లు చెబుతున్నప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పిక్స్ మాత్రం పలు అనుమానాలకు తెరలేపుతున్నాయి. శ్యామ్ ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని.. అతని మరణం వెనుక ఉండొచ్చని పలువరు అనుమానం వ్యక్తం చేశారు. శ్యామ్ ఉరేసుకుంటే అతని కాళ్లు నేలను ఎందుకు తాకాయని.. శరీరంపై గాయాలు ఎందుకు ఉన్నాయని.. నోటిలో గంజాయి కుక్కినట్లు ఎందుకు ఉందని ప్రశ్నిస్తున్నారు. దీంతో శ్యామ్ మృతిపై ఏపీ పోలీసులు సమగ్ర విచారణ జరపాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో #WeWantJusticeForShyamNTR అనే హ్యాష్ట్యాగ్ సోషల్మీడియాలో ట్రెండింగ్గా మారింది.
తన అభిమాని శ్యామ్ మరణం పట్ల జూనియర్ ఎన్టీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. “శ్యామ్ మరణం అత్యంత బాధాకరమైన సంఘటన. అతని కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. శ్యామ్ ఎటువంటి పరిస్థితుల్లో మరణించాడో తెలియకపోవడం మనసును కలిచివేస్తోంది” అని జూనియర్ ఎన్టీఆర్ తెలిపారు. శ్యామ్ మరణంపై తక్షణమే దర్యాప్తు జరిపించాలని విజ్ఞప్తి చేశారు. టాలీవుడ్ నటుడు నిఖిల్ సిద్ధార్థ కూడా దీనిపై స్పందించారు. శ్యామ్ మరణంపై విచారణ జరిపించాలని ఏపీ పోలీసులను ట్విట్టర్ ద్వారా కోరారు. కాగా, శ్యామ్ చెల్లెళ్ల బాధ్యతను ఎన్టీఆర్ ఫ్యాన్స్ వెల్ఫేర్ స్వీకరించింది. పోయిన ప్రాణాన్ని తీసుకురాలేం.. కానీ అతని కుటుంబానికి అండగా నిలుస్తామని ఎన్టీఆర్ ఫ్యాన్ వెల్ఫేర్ ట్వీట్ చేసింది. శ్యామ్ చెల్లెళ్ల బాద్యతను తీసుకుంటామని ట్విట్టర్ వేదికగా ప్రకటించింది.
ఎన్టీఆర్ అభిమాని శ్యామ్ మరణంపై పలు అనుమానాలు వస్తున్న నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. శ్యామ్ మరణం వెనుక వైసీపీ నేతల ప్రమేయం ఉందని ఆరోపణలు వస్తున్నాయని.. ఈ కేసును నిష్పక్షపాతంగా విచారణ జరపాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ఈ మేరకు చంద్రబాబు చేసిన ట్వీట్తో శ్యామ్ మరణం పొలిటికల్ టర్న్ తీసుకుంది. శ్యామ్ మరణం వెనుక వైసీపీ నాయకుల హస్తం ఉందని నారా లోకేశ్ కూడా ఆరోపించారు. శ్యామ్ కుటుంబానికి న్యాయం జరిగేదాకా పోరాటం చేస్తామని ఆయన ట్వీట్ చేశారు. వీరితో పాటు అచ్చెన్నాయుడు, దేవినేని ఉమ సహా పలువురు టీడీపీ నేతలు కూడా వైసీపీ నాయకుల కారణంగానే శ్యామ్ మరణించాడని ఆరోపించారు.
Deeply saddened by the tragic and untimely demise of Shyam in Chintaluru, EG District. The suspicious circumstances surrounding his death are alarming. I strongly urge for a thorough investigation into this matter, ensuring justice is served. It has been alleged that YSRCP… pic.twitter.com/55bpR9cgvR
— N Chandrababu Naidu (@ncbn) June 27, 2023
వ్యక్తిగత కారణాలతోనే శ్యామ్ ఆత్మహత్య చేసుకున్నాడని కోనసీమ జిల్లా ఎస్పీ శ్రీధర్ స్పష్టం చేశారు. ప్రేమ వ్యవహారం, చదువుల్లో వెనుకబాటుతనం కారణంగానే అతను బలవన్మరణానికి పాల్పడ్డాడని ప్రాథమిక విచారణలో తేలిందని పేర్కొన్నారు. మణికట్టు దగ్గర బ్లేడ్తో కోసుకున్న అనంతరం ఉరేసుకున్నాడని తెలిపారు. మణికట్టు కోసుకునేందుకు వాడిన బ్లేడ్ కూడా శ్యామ్ జేబులోనే దొరికిందని చెప్పారు.
శ్యామ్ మరణాన్ని టీడీపీ నాయకులు నీచ రాజకీయాలకు వాడుతున్నారని వైఎస్సార్సీపీ తీవ్రంగా ఖండించింది. ఉరివేసుకోవడం వల్లే శ్యామ్ మరణించాడని పోస్టు మార్టంలో తేలిందని కోనసీమ జిల్లా ఎస్పీ శ్రీధర్ వెల్లడించారని తెలిపింది. అయినప్పటికీ ఈ విషయాన్ని చంద్రబాబు నాయుడు, ప్రతిపక్ష నేతలు రాజకీయం చేస్తున్నారని.. ఇది వాళ్ల వక్రబుద్ధికి నిదర్శనమని పేర్కొంది. ప్రజల మరణాలను కూడా తమ స్వలాభాల కోసం వాడుకునే నాయకులు దేశంలో మరెక్కడా ఉండరేమోనని మండిపడింది. ఈ మేరకు సూసైడ్ చేసుకునే ముందు శ్యామ్ మాట్లాడిన వీడియోలను ట్వీట్ చేసింది. శ్యామ్ కుటుంబ సభ్యులకు ప్రభుత్వం అన్నిరకాలుగా అండగా ఉంటుందని స్పష్టం చేసింది.
వ్యక్తిగత కారణలతో కోనసీమ జిల్లాకు చెందిన 20 ఏళ్ళ యువకుడు శ్యామ్ ఆత్మహత్యకు పాల్పడడం బాధాకరం. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి.
ఊరి వేసుకోవడం వల్లే శ్యామ్ మృతి చెందినట్టు పోస్టుమార్టంలో తేలిందని కోనసీమ జిల్లా ఎస్పీ పి.శ్రీధర్ తెలిపారు. అయినప్పటికీ ఈ విష…
— YSR Congress Party (@YSRCParty) June 27, 2023
ఇది ఎన్నికల సమయం కావడంతో రాష్ట్రంలో అలజడులు సృష్టించేందుకు కొంతమంది రాజకీయ నాయకులు, రాజకీయ నాయకులమని చెప్పుకునే నటులు ప్రయత్నిస్తూ ఉంటారని వైసీపీ విమర్శించింది. ఇలాంటి విష ప్రచారాలు భవిష్యత్తులో మరిన్ని చేస్తారని పేర్కొంది. వాటన్నింటి నుంచి రాష్ట్ర ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ట్వీట్ చేసింది.
శ్యామ్ మరణంపై టీడీపీ నాయకులు చేస్తున్న రాజకీయాన్ని వైసీపీ తిప్పికొట్టింది. ఈ మేరకు చనిపోయే ముందు శ్యామ్ తీసుకున్న సెల్ఫీ వీడియోలను బయటపెట్టింది. ‘ అమ్మా నాన్న నన్నున క్షమించండి. అందరిలో దృష్టిలో నేను వేస్ట్. నేను ఉన్నా మీకు ఉపయోగం లేదు. నాకు జాబ్ చేయాలనే ఇంట్రెస్ట్ లేదు. అందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నా ‘ అని ఆ వీడియోలో శ్యామ్ పేర్కొన్నాడు. ఈ వీడియోలు ఇప్పుడు వైరల్గా మారాయి.
సుసైడ్ చేసుకోబోయే ముందు శ్యామ్ మాట్లాడిన వీడియో!
శ్యామ్ ఆత్మ కి శాంతి చేకూరాలి, ఈ విషాధ సమయంలో శ్యామ్ కుటుంబ సభ్యులకి, స్నేహితులకి మరియు శ్యామ్ తోటి ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ అందరికి మా ప్రగాడ సానుభూతి తెలియజేస్తున్నాం 🙏🏻
శ్యామ్ కుటుంబ సభ్యులకి ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా… pic.twitter.com/DANeXVEgCm
— YSR Congress Party (@YSRCParty) June 27, 2023