అమరావతి: మూడు రాజధానులంటూ సీఎం జగన్ విధ్వంసకర రాజకీయాలు చేస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలంటూ మహాపాదయాత్ర చేస్తున్న రైతులపై లాఠీఛార్జి చేయడం దారుణమని అన్నారు. హైకోర్టు అనుమతితో కొనసాగుతున్న పాదయాత్రను చూసి జగన్ భయపడుతున్నారని పేర్కొన్నారు. కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే పాదయాత్రను అడ్డుకోవడానికి చెక్పోస్టులు, బారికేడ్ల ఏర్పాట్లు, లాఠీఛార్జి లాంటి చర్యలకు దిగి రైతులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు.
లాఠీచార్జిలో గాయపడ్డ రైతులకు మెరుగైన వైద్య సహాయం అందించాలని ఆయన డిమాండ్ చేశారు. ఎంతో ఉన్నత లక్ష్యంతో చేపట్టిన అమరావతి నిర్మాణాన్ని కాదని మూడు రాజధానులంటూ రాష్ట్రాన్ని మూడుముక్కలు చేస్తున్న ప్రభుత్వ వైఖరిని చంద్రబాబు ఖండించారు.