తిరుపతి : తిరుమల (Tirumala) శ్రీవారి దర్శనార్థం ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే భక్తులకు తిరుపతిలో మరింత సౌకర్యవంతంగా వసతి కల్పించేందుకు టీటీడీ అచ్యుతం, శ్రీపథం వసతి సమూదాయాలు నిర్మిస్తున్నట్లు టీటీడీ చైర్మన్ (TTD Chairman) భూమన కరుణాకర రెడ్డి చెప్పారు. తిరుపతిలో దాదాపు 70 సంవత్సరాల క్రితం నిర్మించిన గోవిందరాజస్వామి సత్రం (రెండో సత్రం) స్థానంలో రూ.209 కోట్లతో అచ్యుతం, శ్రీ కోదండరామస్వామి సత్రం(మూడో సత్రం) స్థానంలో రూ.209 కోట్లతో శ్రీపథం వసతి సముదాయాలు నిర్మాణాలకు ఈవో ఎవి ధర్మారెడ్డి తో కలసి శుక్రవారం శంఖుస్థాపన చేశారు.
అనంతరం చైర్మన్ మీడియాతో మాట్లాడుతూ సామాన్యభక్తులకు ప్రాధాన్యం ఇస్తూ ఎలాంటి అసౌకర్యం కలగకుండా శ్రీవారి దర్శనం( Darsan), అన్నప్రసాదం, బస తదితర సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. ఒక్కో బ్లాకులో 4,100 మంది చొప్పున మొత్తం 8, 200 మంది భక్తులు బస చేసే అవకాశముందన్నారు. ఒక్కో బ్లాక్ను ఎనిమిది ఫ్లోర్ల( Eight Floor) తో నిర్మిస్తున్నామని వెల్లడించారు. ఇందులో దాదాపు 200కు పైగా కార్లు, ద్విచక్రవాహనాలు పార్కింగ్ (Parking)చేసుకునే అవకాశం ఉందని వివరించారు.
భక్తులకు మరింత మెరుగ్గా వసతి కల్పించడంలో భాగంగా తిరుమల, తిరుపతిలో ఉన్న విశ్రాంతి గృహాల్లో అవసరమైన వాటిని ఆధునీకరిస్తున్నట్లు తెలిపారు. వీటిని మూడు సంవత్సరాల్లో నిర్మాణాలను పూర్తి చేస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో మేయర్ డాక్టర్ శిరీష, డిప్యూటీ మేయర్ అభినయ్ రెడ్డి, జేఈవోలు సదా భార్గవి, వీరబ్రహ్మం తదితరులు పాల్గొన్నారు.