అమరావతి : వ్యాపార, వాణిజ్య దుకాణాల సముదాయాల వద్దకు మాస్కులు లేకుండా వచ్చే వారికి అనుమతి ఇచ్చే దుకాణాలకు భారీ జరిమానాలు విధిస్తామని ఏపీ ప్రభుత్వం హెచ్చరించింది. రూ.10వేల నుంచి 25వేల వరకు జరిమానా విధించాలని సూచించింది. ఈ మేరకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తాజాగా కొవిడ్ నిబంధనలు మరింత కఠినతరంగా అమలు చేసేందుకు కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది.
భారీ జరిమానాలతో పాటు దుకాణాల మూసివేత చేయాలని నిర్ణయించింది. పౌరులు బహిరంగ ప్రదేశాల్లో తప్పనిసరిగా మాస్కు ధరించాలని , లేకపోతే వంద రూపాయల జరిమానా విధిస్తామంటూ ఉత్తర్వులు జారీ చేసింది. తరుచూ ఉల్లంఘనలకు పాల్పడే దుకాణాలను రెండు రోజులపాటు మూసివేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. నిబంధనలు ఉల్లంఘిస్తున్న దుకాణాల వివరాలను 8010968295 అనే నంబర్కు వాట్సాప్ ద్వారా సమాచారం అందించాలని ప్రభుత్వం ఆ ఉత్తర్వులో పేర్కొంది. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లు నూతన ఉత్తర్వులను పర్యవేక్షించాలని సూచించింది.