YS Sharmila | దళితవాడల్లో ఐదు వేల ఆలయాలు కట్టిస్తామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేసిన ప్రకటనను ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఖండించడం తీవ్ర దుమారం రేపింది. ఈ నేపథ్యంలో షర్మిల స్పందించి, తన వాదనను వివరించారు. హిందూ ధర్మానికి, మతానికి తాను కానీ, కాంగ్రెస్ పార్టీ గానీ వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. దళిత బిడ్డలు చదువుకునే చోట 228 మందికి ఒక బాత్ రూమ్ ఉందని 2025 జూలైలో రాష్ట్ర హైకోర్టు పేర్కొందని గుర్తుచేశారు. దానిపై దృష్టి పెట్టండని మేము అడగడం తప్పా ? కనీసం రోడ్లు ,డ్రైనేజీ కూడా SC,ST కాలనీలలో లేవని ప్రశ్నించడం మేము చేసిన నేరమా ? ప్రభుత్వ దృష్టి దళితవాడల్లో గుడులు కట్టడానికి ముందు స్థానికంగా బడుల మీద, మౌలిక వసతుల కల్పన మీద ఉండాలని చెప్పడం తప్పా ? అని ప్రశ్నించారు.
టీటీడీ నిధులతో TTD నే స్వయంగా గుడులు కడితే అభ్యంతరం ఎవరికి ఉండదని షర్మిల తెలిపారు. మేము లేవనెత్తిన సమస్యల్లా TTD నిధులతో కట్టే దేవాలయాలకు స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రమోషన్ చేసుకోవడం ఏంటి అని ప్రశ్నించారు. ఒక మతానికి పెద్ద దిక్కులా ముఖ్యమంత్రి మాట్లాడకూడదని అన్నారు. తాను ప్రకటించే నిర్ణయాలు అన్ని మతాలకు సమానంగా ఉండాలన్నారు. కూటమి ప్రభుత్వంలో, బీజేపీతో కలిసున్న సీఎం గారు.. మిగతా మతాలకు అభద్రతాభావం కలిగించకూడదని సూచించారు.
మేమేదో హిందూ ధర్మానికి, హిందువులకు వ్యతిరేకులమని చూపించే కుటిల ప్రయత్నాలు చేస్తున్నారని షర్మిల మండిపడ్డారు. రాష్ట్రంలో మళ్లీ పుంజుకుంటున్న కాంగ్రెస్ పార్టీపై, వ్యక్తిగతంగా నాపై BJP, RSS మత ఛాందస వాదులు విష ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందువులను కావాలని రెచ్చగొడుతున్నారని.. పీఠాధిపతులతో తిట్టిస్తున్నారని తెలిపారు. నా వ్యాఖ్యలను వక్రీకరించి తప్పుడు ఉద్దేశ్యాన్ని మత పిచ్చి RSS, BJP వాదులు ఆపాదిస్తున్నారని అన్నారు. మత రాజకీయాలు చేసి లబ్ది పొందేందుకు BJP, ఆర్ఎస్ఎస్, ప్రధాని మోదీ చేస్తున్నవి నీచరాజకీయాలు అని మండిపడ్డారు.
హిందూ ధర్మానికి, మతానికి, నేను గానీ కాంగ్రెస్ పార్టీ గానీ ఎంత మాత్రం వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ సర్వమత సమ్మేళనమని.. రాజ్యాంగాన్ని గౌరవించే వాళ్లమని వివరించారు. ఒక మతానికి ఒక న్యాయం, మరో మతానికి అన్యాయం ఇది కాదు కాంగ్రెస్ సిద్ధాంతమని స్పష్టం చేశారు. పవిత్రమైన తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిపితే,భక్తుల మనోభావాలు దెబ్బతీశారని, ఇది ఘోర అపచారం అని, వెంటనే CBI దర్యాప్తునకు ఆదేశించాలని మొదట డిమాండ్ చేసింది నేనే అని గుర్తుచేశారు. ప్రజల పక్షాన మా డిమాండ్ లో మంచిని వెతకకుండా, దానికి చంద్రబాబు సమాధానం చెప్పకుండా , కుహనా మేధావులతో మాట్లాడించడం సిగ్గుచేటు అని విమర్శించారు. ప్రజల కోసం మేము మాట్లాడితే, మతం కోసం RSS, బీజేపీ మాట్లాడుతుందని అన్నారు. ఎవరు మత పిచ్చిగాల్లో, ఎవరు మత విద్రోహులో, విషం చిమ్మేది ఎవరో రాష్ట్ర ప్రజలకు అంతా తెలుసు అని అన్నారు. TTD ని గుంజడం కాదు .. కూటమి ప్రభుత్వానికి దమ్ముంటే మేము లేవనెత్తిన అంశాల మీద ప్రభుత్వ పరంగా సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు.