శ్రీశైలం : మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు నేత్రపర్వంగా సాగుతున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో ఆలయ వీధులన్నీ కిటకిటలాడగా.. శివన్నామస్మరణతో మార్మోగాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో పాటు కర్నాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఉత్తరాది రాష్ట్రాల నుంచి భక్తులు తరలివచ్చారు. తెల్లవారు జాము నుంచే గంగా భవానీ, పుష్కరిణి వద్ద పుణ్య స్నానాలు చేసుకొని క్యూలైన్ల ద్వారా దర్శనాలకు బారులు తీరారు.
ఇరుముడి శివస్వాములకు, సాధారణ భక్తులకు కూడా అలంకార దర్శనాలు కల్పిస్తూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేసినట్లు కార్యనిర్వాహణాధికారి ఎస్ లవన్న తెలిపారు. భక్తులకు లడ్డూ ప్రసాదాలను కౌంటర్లలో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. అదేవిధంగా ఉదయం 10 గంటల నుంచి అన్నదానం చేస్తున్నారు. కాలినడకతో భక్తులకు వైద్యసేవల కోసం వసతులు కల్పించామని, అత్యవసర సమయంలో దేవస్థానం కాల్ సెంటర్లకు సమాచారం ఇవ్వాలని ఈవో కోరారు. అనుమానితుల కదలికలను ఎప్పటికప్పుడు సీసీ కెమెరాలతో గమనిస్తూ ప్రత్యేక పోలీస్ బలగాలను విధుల్లో నియమించినట్లు డీఎస్పీ తెలిపారు.