Srisailam | శ్రీశైలంలో దసరా మహోత్సవాలు శాస్త్రోక్తంగా జరుగుతున్నాయి. దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మూడవ రోజు మంగళవారం చంద్రఘంటాదేవి రూపంలో భ్రమరాంబికాదేవి భక్తులకు దర్శనమిచ్చారు. ఆది పరాశక్తుల్లో తృతీయ రూపిణి అయిన చంద్రఘంటాదేవి యుద్ధోన్ముఖురాలై సింహవాహనాన్ని అధిష్టించి భక్తులకు దర్శనమిచ్చారు. చంద్రఘంటా సమేతుడైన శ్రీశైలేశుడు రావణ భుజస్కందాలపై విహరిస్తూ భక్త జనాన్ని అలరింప జేశారు.
ఈవో పెద్దిరాజు ఆధ్వర్యంలో ఉదయం అమ్మవారికి ప్రాత;కాల పూజలు, విశేష కుంకుమార్చనలు, నవవరణార్చన, జపానుష్టపారాయణ, చతుర్వేద పారాయణాలు, చండీ, దుర్గ, కాళి, లలితార్చనలు, కుమారి పూజలు చేశారు. అలాగే స్వామి వారికి రుద్రహోమం, రుద్రయాగాంగ జపాలు, రుద్ర పారాయణాలు చేశారు. మధ్యాహ్నకాలార్చన, సహస్ర నామార్చన, మహా నివేదన తర్వాత సాయంకాలం జపానుష్టానాలు నిర్వహించినట్లు ప్రధాన అర్చకులు శివప్రసాద్, మార్కండేయ శర్మలు తెలిపారు.
దేవి సాయంత్రం భ్రామరీ అమ్మవారిని పరాశక్తి రూపాల్లో మూడవ ఆవతారమైన చంద్రఘంటాదేవి రూపంలో అలంకరించి అమ్మవారిసింహ మండపం వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై అర్చక వేదపండితులు పూజలు నిర్వహించారు. ఈ దేవి పది చేతులతో కుడి వైపు పద్మం, బాణం, ధనస్సు, అభయహస్తం, జపమాల, ఎడమ వైపు త్రిశూలం, గద, ఖఢ్గం, పంచముద్ర, కమండలాన్ని ధరించి భక్తులకు దర్శనమిచ్చారు.
ప్రశాంత వదనంతో శాంతరూపిణిగా ఉన్నా చంద్రఘంటాదేవి యుధ్దోన్ముఖురాలై ఉంటుంది. ఈ అమ్మవారు తలపై అర్ద చంద్రుడుని ఘంటాకారంలో ధరించడంతో చంద్రఘంటాదేవిగా పిలుస్తారు. అమ్మవారిని పూజించడం వలన భక్తుల కష్టాలు తీరుతాయని, ఈ దేవి ఆరాధన వలన సౌమ్యం, వినమ్రత కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి.
అనంతరం అక్కమహాదేవి అలంకార మండపంలో ఏర్పాటు చేసిన రావణవాహనసేవపై ఆసీనులైన స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. చంద్రఘంటా దేవి సమేతుడైన శ్రీశైలేశుడు రావణ వాహనంపై విహరిస్తూ భక్తులను కటాక్షించారు.
గ్రామోత్సవంలో భాగంగా స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులు గంగాధర మండపం మొదలు నంది మండపం మీదుగా బయలు వీరభద్రస్వామి ఆలయం వరకు ఊరేగుతూ కరుణించారు. గ్రామోత్సవంలో నాదస్వరం, మహిళా వీరగాని కన్నడ జానపద కళాప్రదర్శన, రాజభటుల వేషాలు, కేరళ వారి కథకళి వేషాలు, తప్పెట చిందు, కాళికా నృత్యం, చెక్కభజన, కోలాటం, ఢమరుకం, చిడతలు, శంఖం, పిల్లగ్రోవి, త్రిశూలం, జేగంట, కురవడోలు, కొమ్ము, నందికోలు సేవ మొదలగు వివిధ రకాల విన్యాసాలతో ఆధ్యాంతం కనులపండువగా సాగింది .
ఉత్సవం తరువాత సువాసిని పూజ, కాళరాత్రిపూజ మంత్రపుష్పంతో పాటు తీర్థప్రసాద వితరణ ఆదిదంపతులకు ఆస్థానసేవ జరిపించారు. ఈ కార్యక్రమంలో ఈవో పెద్దిరాజు, ధర్మకర్తల మండలి సభ్యులు, ఏఈవోలు ఫణిదర్ప్రసాద్, హరిదాసు, మోహన్, సెక్యూరిటీ అధికారి శివప్రసాద్, రవికుమార్, స్వాములు ఉన్నారు. ఆలయ దక్షిణ మాడవీధిలో కళారాధన సాంస్కతిక కార్యక్రమాలు కూడా భక్తులను ఆకట్టుకున్నట్టు ఆలయ అధికారులు తెలిపారు.
శరన్నవరాత్రుల్లో నాల్గవ రోజు బుధవారం భ్రమరాంబాదేవి అమ్మవారు కూష్మాండదుర్గ అలంకారంలో కనిపిస్తారు. మల్లికార్జున స్వామి కైలాస వాహన సేవలో భక్తులకు దర్శనమిస్తారని ఈవో పెద్దిరాజు తెలిపారు. కూష్మాండ దుర్గను ఉపాసంచడం వల్ల రోగాలు, శోకాలు తొలగిపోయి ఆరోగ్యం చేకూరి ఆయువు యశస్సు వృద్ధి చెందుతుందని భక్తుల విశ్వాసం.