APSRTC |ఆర్టీసీ బస్సులో సీటు కోసం తలెత్తిన వివాదంలో మహిళలు దారుణంగా కొట్టుకున్నారు. బాలికపై పలువురు మహిళలు మూకుమ్మడిగా దాడి చేశారు. ఈ ఘటనలో బాలిక స్పృహతప్పి పడిపోవడంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఏపీలోని విజయనగరం జిల్లా బొబ్బిలి ఆర్టీసీ కాంప్లెక్స్లో ఈ ఘటన చోటుచేసుకుంది.
విశాఖపట్నానికి చెందిన బెజ్జుపల్లి భార్గవి (14) స్థానిక పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది. రెండు రోజుల క్రితం తన తల్లి రాంబాయితో కలిసి బొబ్బిలి పట్టణంలోని మేనమామ శ్రీను ఇంటికి వచ్చింది. గొల్లపల్లిలో జరిగిన దాడితల్లి ఉత్సవాలు చూసుకుని గురువారం రాత్రి తిరుగు ప్రయాణంలో విశాఖకు వెళ్లే బస్సు ఎక్కింది.
అయితే అప్పటికే నిరీక్షిస్తున్న చాలామంది మంది ప్రయాణికులు ఎక్కే ప్రయత్నం చేశారు. భార్గవి కూడా తొందరగా ఎక్కి ఒక సీటులో కూర్చోబోయింది. కానీ అప్పటికే ఎక్కి ఓ మహిళ ఆ బాలికను అడ్డుకుంది. తాను ముందే బ్యాగ్ వేశానని.. సీటు ఇవ్వాలని బాలిక కోరింది. కానీ సదరు మహిళ వినిపించుకోకుండా బాలికతో గొడవకు దిగింది. ఆమెతోపాటు వచ్చిన మహిళలు కూడా మూకుమ్మడిగా భార్గవిపై దాడి చేశారు. ఆ దాడిలో భార్గవి అక్కడే పడిపోయింది. దీంతో దాడి చేసిన మహిళలు అక్కడి నుంచి జారుకున్నారు.
ఆర్టీసీ బస్సులో సీటు కోసం దారుణంగా కొట్టుకున్న మహిళలు
విజయనగరం జిల్లా బొబ్బిలి వద్ద ఆర్టీసీ బస్సులో సీటు కోసం ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న మహిళలు
దాడిలో తీవ్రంగా గాయపడిన బెజ్జుపల్లి భార్గవి(14) అనే బాలిక, పరిస్థితి విషమంగా ఉండడంతో విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన స్థానికులు pic.twitter.com/TOHvPySyge
— Telugu Scribe (@TeluguScribe) May 1, 2026
బాధితురాలి తల్లితో పాటు మరో ఇద్దరు అమ్మాయిలు ఉన్నప్పటికీ ఏమీ చేయలేకపోయారు. దాడి చేసిన మహిళలు జారుకోవడంతో స్పృహతప్పిన బాలికను స్థానిక సామాజిక ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం విజయనగరం జిల్లా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాలిక పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.