శ్రీశైలం: శ్రీశైలం మహా క్షేత్రంలో గణపతి నవరాత్రోత్సవాలు ముగిసాయి. స్వామివారి యాగశాలలో శుక్రవారం ఉదయం పూర్ణాహుతి కార్యక్రమాన్ని జరిపించినట్టు ఆలయ స్థానాచార్యులు పూర్ణానంద ఆరాధ్యులు తెలిపారు. అలాగే, సాక్షి గణపతి ఆలయంలో పూజలందుకున్న మృతికా గణపతికి వ్రతకల్ప శాస్త్రోక్త పూజలు చేసి మండపారాధన, జపానుష్టాలు, ఉపనిషత్ పారాయణలు, రుద్రహోమాన్ని జరిపించారు. ప్రధానాలయంలోని రత్నగర్భ గణపతికి, యాగశాలలోని పంచలోహ వరసిద్ధి వినాయకుడికి కూడా ప్రత్యేక పూజలు జరిపించారు. అనంతరం నిత్యహోమ బలిహరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. నవరాత్రులు విశేష పూజలందుకున్న మృతికా గణపతి స్వామివారికి నిమజ్జనోత్సవాన్ని ఘనంగా జరిపించినట్టు ఈవో లవన్న తెలిపారు.
శ్రీశైలం భ్రమరాంబికా మల్లిఖార్జున స్వామి అమ్మవార్ల క్షేత్రంలో పౌర్ణమి ప్రత్యేక వేడుకలను వైభవంగా నిర్వహించారు. లోక కళ్యాణార్ధం పరివార దేవతలకు అర్చనలు, అభిషేకాలు జరిపించినట్టు ఈవో లవన్న తెలిపారు. శుక్రవారం సాయంత్రం పౌర్టమి గడియల్లో ఆలయ ప్రాకారంలో స్వామిఅమ్మవార్లను పల్లకిలో ఆశీనులజేసి, ఆలయ ప్రదక్షిణ, క్షేత్ర గిరిప్రదక్షిణ చేశారు. అర్చక వేదపండితులు, భక్తులు శివనామస్మరణ చేస్తూ నందిమండపం నుంచి బయలువీరభద్రస్వామి ఆలయం మీదుగా సాగిన గిరిప్రదక్షిణలో యాత్రికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అమ్మవారికి లక్ష కుంకుమార్చన చేసి, ఊయల సేవ, పల్లకి సేవ జరిపించారు. ప్రత్యేక పుష్పాలతో అలంకరించిన ఊయలలో స్వామిఅమ్మవార్లను ఆశీనులను చేసి, అర్చకులు అష్టోత్తర నామావళిని పఠించారు. అనంతరం స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను పల్లకిలో వేంచేబు చేసి ఆలయ ప్రదక్షిణగా అర్చక వేదపండితులు ఉత్సవం జరిపించారు. ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో భక్తులు పాల్గొనేందుకు ఏర్పాట్లు చేసినట్టు ఏఈవో హరిదాసు తెలిపారు.