అమరావతి : ఆంధ్రప్రదేశ్లో రోడ్ల జాతీయ రహదారుల అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తున్నట్లు కేంద్ర రహదారులు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ బుధవారం ట్వీట్లో ప్రకటించారు. ములకాలచెరువు నుంచి మదనపల్లె సెక్షన్లోని 42 జాతీయ రహదారిని 4 లేన్గా మార్చే ప్రతిపాదనకు ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు. ఈ మార్గంలో మొత్తం రూ.480 కోట్లతో 4 లేన్ రహదారి నిర్మాణం చేపట్టనున్నట్టు ఆయన పేర్కొన్నారు.
దీంతోపాటు విజయవాడ మీదుగా ఉత్తరాఖండ్ వరకూ ఉన్న 30 నెంబరు జాతీయ రహదారికి సంబంధించిన విస్తరణ పనులకూ 388 కోట్ల రూపాయలను కేటాయిస్తున్నట్టు ఆయన వివరించారు. 170 కిలోమీటర్ నుంచి 700 వరకూ, 234 కిలోమీటర్ల నుంచి 567 వరకూ రెండు లేన్లుగా రహదారి విస్తరణ పనులు చేపట్టనున్నామని ఆయన తెలిపారు.