Road Accident | వంతెనపై నుంచి ఆటో బోల్తాపడిన సంఘటనలో నలుగురు దుర్మరణం చెందారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్లోని ఏలూరులో చోటు చేసుకున్నది. కుక్కునూరు మండలం వేలేరు వంతెనపై నుంచి ఆటో ప్రమాదవశాత్తు వాగులో పడిపోయింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో 16 మందికి గాయాలయ్యాయి. ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండగా.. నలుగురు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని హుటాహుటిన బూర్గంపాడు ఆసుప్రతికి తరలించారు.
ప్రమాద సమయంలో ఆటోలో 20 మంది ప్రయాణికులు ఉన్నారు. భద్రాచలం వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో ఘటన జరిగింది. బాధితులను ఏలూరు జిల్లాలోని టీ నర్సాపురం మండలం తిరుమలదేవిపేట గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. మృతులను సందీప్ (10), ప్రదీప్ (10), శ్రీనివాసరావు (40), దుర్గారావు (43)గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి సంబంధించి వివరాలు తెలియాల్సి ఉంది.