అమరావతి : సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీరమణ నాలుగు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా తొలిరోజు రేపు ( శుక్రవారం) సొంత గ్రామానికి రానున్నారు. సీజేఐ బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారిగా సొంత గ్రామమైన కృష్ణా జిల్లా పొన్నవరం గ్రామానికి రానున్న సందర్భంగా జస్టిస్కు ఘన స్వాగతం పలికేందుకు గ్రామస్థులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
జస్టిస్ ఎన్వీ రమణ రేపు ఉదయం విజయవాడ నుంచి రోడ్డు మార్గంలో కంచికచర్ల మీదుగా పేరకలపాడు క్రాస్రోడ్డుకు చేరుకుంటారు. అక్కడినుంచి పొన్నవరం గ్రామానికి భారీ ఊరేగింపుతో స్వాగతం పలికేందుకు గ్రామస్థులు నిర్ణయించారు. రైతు కుటుంబం నుంచి వచ్చిన ఆయనను ఎద్దుల బండిపై ఊరేగింపుగా తీసుకెళ్లేందుకు గ్రామస్థులు ఏర్పాట్లు చేస్తున్నారు. అనంతరం పౌర సన్మానం చేసేందుకు గ్రామంలో భారీ వేదికను ఏర్పాటు చేశారు. తర్వాత గ్రామంలోని శివాలయంలో జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు ప్రత్యేక పూజలు చేయనున్నారు. మధ్యాహ్నం విజయవాడకు వెళ్లి చిన్నతనంలో ఆయనతో పాటు చదువుకున్న బాల్యమిత్రులు, గ్రామస్థులతో కొంతసేపు గడపనున్నారు.
25,26 తేదీల్లో విజయవాడలో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో సీజే పాల్గొననున్నారు. 27న ఉదయం విజయవాడ నుంచి హైదరాబాద్కు చేరుకుంటారని షెడ్యూల్లో పేర్కొన్నారు.