Merugu Nagarjuna | నాపై కోపం కోపం ఉంటే చంపండి.. అంతేకానీ ఇలాంటి దుష్ప్రచారం చేయవద్దని మాజీ మంత్రి మేరుగు నాగార్జున కోరారు. తనను శారీరకంగా లోబరుచుకుని, ఉద్యోగం ఇప్పిస్తానని రూ.90లక్షలు తీసుకున్నట్లు ఆరోపిస్తూ విజయవాడకు చెందిన మహిళ ఫిర్యాదు చేయడంపై మేరుగు నాగార్జున స్పందించారు. రాజకీయాల్లో ఎదుగుతున్న దళితుడిని టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు. తాను ఏ తప్పు చేయలేదని.. ఏ పరీక్షకైనా సిద్ధమని తెలిపారు. ఈ విషయంలో తప్పు ఉందని తేలిస్తే ఉరిశిక్షకు అయినా సిద్ధమని స్పష్టం చేశారు.
మంత్రిగా ఉన్న సమయంలో తనను అనేక మంది కలిసి ఉంటారని.. కానీ ఎవరితోనూ వ్యక్తిగతంగా పరిచయం లేదని మేరుగు నాగార్జున తెలిపారు. తనపై లైంగిక కేసు పెట్టిన విషయంలో జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తానని అన్నారు. ఏ ఆధారాలతో ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారని ప్రశ్నించారు. తనపై తప్పుడు కేసు పెడుతున్నారని.. తాను దేనికైనా సిద్దమని చెప్పారు. ఈ కేసు విషయంలో పోలీసులు నిజాయితీగా దర్యాప్తు చేయాలని కోరారు.
వైసీపీ నేత, మాజీ మంత్రి మేరుగ నాగార్జునపై తాడేపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. తనను లైంగికంగా వేధించారని విజయవాడకు చెందిన ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. తనకు ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి మేరుగు నాగార్జున రూ.90 లక్షలు తీసుకున్నాడని విజయవాడకు చెందిన బాధితురాలు తాడేపల్లి పీఎస్లో ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. తన డబ్బు తిరిగి ఇవ్వాలని అడిగితే చంపేస్తానని బెదిరిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. విశాఖలో ఓ గిరిజన టీచర్ను స్లో పాయిజన్ ద్వారా చంపేశానని.. నీదే గతి పడుతుందని మేరుగు నాగార్జున పీఏ మురళి బెదిరిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొంది. తనకు రావాలని రూ.90 లక్షలను ఇప్పించాలని విజ్ఞప్తి చేసింది.