అమరావతి : ఏపీ ప్రభుత్వంతో ఉద్యోగులు తాడో పేడో తేల్చుకోవాలని నిర్ణయించుకోవడానికి సిద్ధమవుతున్నారు. పీఆర్సీతో పాటు మూడు జీవోలను రద్దు చేయాలని, డీఏలతో పాటు పాత పీఆర్సీని అమలు చేయాలని డిమాండ్ చేస్తు ఈ నెల 21న ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇవ్వనున్నారు. ఈ రోజు ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సమీర్ శర్మ కొత్త పీఆర్సీతో జీతాలు తగ్గవని , కేంద్ర పీఆర్సీనే అమలు చేస్తామని, పీఆర్సీతో హెచ్ఆర్ఏ సంబంధం లేదని ప్రకటించడాన్ని ఏపీ జేఏసీ , ఏపీ అమరావతి జేఏసీ, ఏపీ సచివాలయ సంఘం నాయకులు బండి శ్రీనివాస్రావు, బొప్పరాజు వెంకటేశ్వర్లు, వెంక్రటామిరెడ్డి తప్పుబట్టారు.
సీఎం జగన్ ను అధికారులు తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. అధికారులు, ప్రభుత్వం ఉద్యోగులను మోసం చేసిందని దుయ్యబట్టారు. పీఆర్సీతో జీతం పెరుగుతుందని అబద్దం చెబుతున్నారని బండి శ్రీనివాసరావు ఆరోపించారు. తమ బాధ్యులతో చర్చించి ఈనెల 21 న ప్రభుత్వానికి నోటీసులు అందజేయనున్నట్లు ఆయన ప్రకటించారు .
డీఏ , పీఆర్సీ రెంటినీ వేర్వేరుగా చూడాలని వెంకట్రామిరెడ్డి ప్రభుత్వానికి సూచించారు. డీఏలు ఇచ్చి జీతంలో సర్ధుబాటు చేయడం ఉద్యోగులను మోసం చేయడమే బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. సీఎస్ చెప్పిన లెక్కలన్నీ బోగస్ అని విమర్శించారు. ఫిట్మెంట్ అంటే జీతాలు పెరగాలి.. కానీ తగ్గొద్దని వివరించారు. ప్రభుత్వ విధానాలపై రేపు ఇరు జేఏసీల పక్షాన సమావేశమై చర్చించి భవిష్యత్తు ఆందోళన కార్యక్రమాలపై నిర్ణయం తీసుకుంటామని ఆయన వెల్లడించారు.