అమరావతి : ఏపీలోని చిత్తూరు జిల్లాలో ఓ ఏనుగు విద్యుదాఘాతానికి గురైంది. సదుం మండలం చెరుకువారిపాలెంలో ఓ రైతు పొలం వద్ద బోర్ మోటార్కు ఉన్న విద్యుత్ తగిలి మృతి చెందింది. ఏనుగు మృతి సమాచారంతో అటవీ శాఖ అధికారులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. విషయం తెలుసుకున్న ఏపీ మంత్రి పెద్దిరెడ్డి గ్రామానికి వెళ్లి సంఘటనా స్థలాన్ని సందర్శించారు. స్థానికుల నుంచి సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు.
సదుం మండలంలో వారం రోజులుగా ఏనుగుల గుంపు సంచరిస్తోందని గ్రామస్తులు వివరించారు. రాత్రి కూడా గ్రామం వైపు ఏనుగుల గుంపు రావడంతో తాము పటాకులతో అటవి ప్రాంతానికి తరమి వేశామని తెలిపారు. తమిళనాడు ప్రాంతానికి చెందిన అటవి అధికారులు ఏనుగుల గుంపును ఆ ప్రాంతం నుంచి తరిమి వేస్తుండడంతో చిత్తూరుకు సమీపంలో ఏనుగులు సంచరిస్తున్నాయని ఏపీ అధికారులు తెలిపారు. మూడు రోజుల క్రితం జోగివారిపల్లె పొలంలో నిద్రిస్తున్న ఎల్లప్ప అనే రైతును ఏనుగుల గుంపు తొక్కి చంపిన విషయం తెలిసిందే .