అమరావతి : కేంద్ర ఎన్నికల సంఘం పోస్టల్ బ్యాలెట్ల (Postal ballot) లెక్కింపు పలు మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ మేరకు ఏపీ సీఈవో (AP CEO) కు అందిన ఉత్తర్వులు జిల్లా అధికారులకు చేరవేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా పోస్టల్ బ్యాలెట్ నమోదై రికార్డు సృష్టించింది. ఏపీలో 5 లక్షల 40 వేల మంది పోస్టల్ బ్యాలెట్ ఎన్నికల్లో పాల్గొన్న సిబ్బంది, హోం ఓటింగ్, డ్రైవర్లు, మెడికల్ అండ్ హెల్త్ సిబ్బంది, జర్నలిస్టులు వంటి అత్యవసర సర్వీసుల కింద కూడా ఉన్నవారు పోస్టల్ బ్యాలెట్ను వినియోగించుకున్నారు.
పోస్టల్ బ్యాలెట్ వేసే సమయంలో ఫారం 13ఏ పై పోలింగ్ బూత్(Polling Booth) లో ఉన్న గెజిటెడ్ అధికారి సంతకంతో పాటు సీల్ (Seal ) కూడా వేయాలి. కానీ చాలాచోట్ల గెజిటెడ్ అధికారులు సీల్ వేయలేదు. అయినప్పటికీ సంబంధిత అధికారి సంతకంతో పాటు అతని వివరాలు ఉంటే అలాంటి ఓట్లను కచ్చితంగా పరిగణలోకి తీసుకోవాలని ఈసీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
సీల్ లేదనే కారణంతో చెల్లని ఓట్లుగా పరిగణించవద్దని ఆదేశించింది. ఇక బ్యాలెట్ పేపర్ వెనుక ఎన్నికల రిటర్నింగ్ అధికారి సంతకం లేకపోయినా ఆ బ్యాలెట్ చెల్లుతుందని స్పష్టం చేసింది. పోస్టల్ బ్యాలెట్ కవర్ ఫారం సీ ఓటర్ సంతకం లేదని బ్యాలెట్ను తిరస్కరించవద్దని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. ఇక పోస్టల్ బ్యాలెట్లో ఒక అభ్యర్థి ఎదురుగా టిక్ మార్క్ పెట్టకున్నా, బ్యాలెట్ చిరిగిన, ఒకరికంటే ఎక్కువ అభ్యర్థుల ఎదుట ఉన్న అలాంటి ఓట్లను చెల్లనివిగా పరిగణించాలని సూచించింది.