BRS | హైదరాబాద్, జూలై 8 (నమస్తే తెలంగాణ): ఏపీ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిపోతున్నదని రాబోయే ఎన్నికల్లో వైసీపీ ఓటమి ఖాయమని బీఆర్ఎస్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు డాక్టర్ తోట చంద్రశేఖర్ అన్నారు. శనివారం ఆళ్లగడ్డకు చెందిన బీఆర్ఎస్ నాయకులు డాక్టర్ వెస్లీ, తెనాలికి చెందిన షేక్ భాషా ఆధ్వర్యంలో నంద్యాల జిల్లాకు చెందిన పలువురు బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా డాక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ టీడీపీ, వైసీపీ ప్రభుత్వాల్లో సామాజిక న్యాయం కొరవడిందన్నారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ప్రజాప్రతినిధులకు పేరుకే పదవులు ఇచ్చారు కానీ అధికారం ఇవ్వలేదని ధ్వజమెత్తారు. ఈ రెండు పార్టీలు వారి కులాలకు పెద్దపీట వేస్తూ సామాజిక న్యాయానికి తిలోదకాలిచ్చాయని మండిపడ్డారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వాన్ని ఆంధ్రా ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. కార్యక్రమంలో అన్నపురెడ్డి ప్రదీప్, పట్ల సతీశ్, మందముల మహీందర్, సామెయిల్, మాదిగ ఆనంద్ తదితరులు తోట సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.