అమరావతి : ఏపీలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్, జనసేన పవన్ కల్యాణ్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్నది. ‘రిపబ్లిక్’ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికగా ఏపీలో సినిమా థియేటర్లు, టికెట్ల విషయంలో సర్కారు తీసుకున్న నిర్ణయాలపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై సమాచారశాఖ మంత్రి పేర్ని నానితోపాటు పలువురు మంత్రులు కౌంటర్ ఇచ్చారు. మరో వైపు సినీ నటుడు, దర్శక నిర్మాత పోసాని కృష్ణ మురళీ సైతం పవన్పై నిన్న తీవ్ర విమర్శలు చేసిన చేసిన విషయం తెలిసిందే. తాజాగా జనసేన అధినేత మరోసారి ఏపీ సర్కారు, మంత్రులపై ట్విట్టర్ వేదికగా చేసిన కామెంట్లు ఏపీలో సంచలనంగా మారాయి.
వైఎస్సార్ కాంగ్రెస్ నేతలను పవన్ కల్యాణ్ కుక్కలతో పోల్చారు. దీనికి మంత్రి నాని సైతం అదే స్థాయిలో కౌంటర్ ఇస్తూ పవన్ను పందితో పోల్చారు. జనసేనాని పవన్ కల్యాణ్ వైఎస్సార్ సీపీ నేతలను ఉద్దేశిస్తూ.. పద్యం రూపంలో.. ‘తుమ్మెదల ఝుంకారాలు.. నెమళ్ళ క్రేంకారాలు.. ఏనుగుల ఘీంకారాలు.. వైసీపీ గ్రామసింహాల గోంకారాలు సహజమే’ అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. అంతే కాకుండా నాకు ఇష్టమైన పాటల్లో ఇది ఒకటి అంటూ.. ‘హూ లెట్ ది డాగ్స్ అవుట్’ పాట లింక్ను షేర్ చేశారు. వైసీపీ ప్రభుత్వం ‘పాలసీ ఉగ్రవాదం’కి అన్నీ రంగాలు, అన్ని వర్గాలు నాశనం అయిపోతున్నాయి. దీనిని ఎదుర్కోవలిసిన సమయం ఆసన్నమయింది’ అంటూ మరో ట్వీట్ చేశారు.
‘హిందూ దేవాలయాలు, హిందూ దేవతామూర్తుల విగ్రహాలపై ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 140 దాడులు, విధ్వంసాలు. వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్లో ఈ రెండున్నర ఏళ్లలో జరిగిన ప్రగతి ఇదే! దాడులకు పాల్పడిన దోషులంతా క్షేమం. ఎక్కడున్నాయి వైసీపీ గ్రామ సింహాలు?అంటూ మరో ట్వీట్లో తీవ్ర విమర్శలు చేశారు. పవన్ కల్యాణ్ ట్వీట్లకు మంత్రి పేర్ని నాని సైతం ట్విట్టర్ ద్వారా అదేస్థాయిలో కౌంటర్ ఇచ్చారు. ‘జనం ఛీత్కారాలు, ఓటర్ల తిరస్కారాలు, తమరి వైవాహిక సంస్కారాలు, వరాహ సమానులకు న‘మస్కా’రాలు’ అంటూ పవన్ను ఉద్దేశిస్తూ ట్వీట్ చేశారు. అలాగే పవన్ కల్యాణ్పై ఓ ట్రోల్ వీడియోనూ పోస్ట్ చేశారు.