తిరుమల : తిరుమల (Tirumala) లో భక్తుల రద్దీ కొనసాగుతుంది. కార్తిక మాసం సందర్భంగా కలియుగ ప్రత్యక్షదైవం వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు భక్తులు ఆలయానికి తరలివస్తున్నారు. భక్తుల రాకతో 26 కంపార్ట్మెంట్లు నిండిపోగా టోకెన్లు లేని భక్తులకు 14 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు వివరించారు.
నిన్న స్వామివారిని 71,123 మంది భక్తులు దర్శించుకోగా 26,689 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం(Hundi Income) రూ.3.84 కోట్లు వచ్చిందని వివరించారు.
పంచమీ తీర్థానికి పటిష్ట ఏర్పాట్లు
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నవంబర్ 18న నిర్వహించనున్న
పంచమి తీర్థానికి టీటీడీ అత్యద్భుతమైన ఏర్పాట్లు చేసిందని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి
తెలిపారు. వాహన సేవలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు .
పంచమి తీర్థానికి వచ్చే భక్తులందరికీ అల్పాహారం, తాగునీరు, పాలు, అన్నప్రసాదాలు అందించేందుకు ఏర్పాటు చేశామన్నారు. పంచమి తీర్థానికి తమిళనాడు తో పాటు చుట్టు పక్కల ప్రాంతాల నుంచి లక్షల సంఖ్య లో తరలి వచ్చే భక్తుల కోసం అవసరమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని చైర్మన్ వివరించారు .