(AP Cinema) అమరావతి: గత కొన్ని రోజులుగా ఏపీలో రచ్చరచ్చగా మారిన సినిమా టిక్కెట్ల వివాదం కొలిక్కి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. టిక్కెట్ల ధరలు, థియేటర్ల సమస్యలపై చర్చించేందుకు ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు మంత్రి పేర్ని నానితో సచివాలయంలో భేటీ అయ్యారు. గంటన్నర పాటు వీరి భేటీ కొనసాగింది. సమావేశానికి 24 మంది డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు హాజరయ్యారు. ఈ సమావేశంలో సినిమా థియేటర్లకు సంబంధించిన పలు అంశాలను మంత్రి దృష్టికి తీసుకొచ్చినట్లు తెలుస్తున్నది. అలాగే, టిక్కెట్ల ధరలపై ప్రతిపాదనలను కూడా మంత్రికి అందజేసినట్లు సమాచారం. సినిమా టాకీసుల తనిఖీ విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు.
డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లతో సమావేశం అనంతరం పేర్ని నాని ఏపీ సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. సినిమా పరిశ్రమ సమస్యలను తన దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు. సాధ్యమైనంత వరకు ఈ సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం పరిశీలన చేస్తుందని చెప్పారు. ఇదేసమయంలో ప్రజలు ఇబ్బందిపడకుండా వివిధ ప్రజా సంఘాలు ఇచ్చిన విజ్ఞాపనలను కూడా పరిశీలిస్తామని పేర్కొన్నారు. సినిమా థియేటర్లలో ప్రేక్షకులకు అవసరమైన వసతులను మెరుగుపర్చాలని ఇదివరకే చెప్పామన్నారు. థియేటర్ల యాజమాన్యాలకు కావాల్సినంత సమయం ఇచ్చినప్పటికీ ఎలాంటి మార్పు కనిపించలేదు, అందుకే తనిఖీలు చేశామని స్పష్టం చేశారు. కనీసం థియేటర్లను రెన్యువల్ చేయించుకోకుండానే నడుపుతున్నారని, అనుమతులు లేకుండా నడుపుతున్న థియేటర్లనే సీజ్ చేశామని వెల్లడించారు. సినిమా టిక్కెట్ల ధరలు పెంచాలని డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు కోరారని తెలిపారు. ఏ కిరణా కొట్టు పక్కనున్న థియేటర్ గురించి హీరో నాని మాట్లాడారో తమకు తెలియదన్నారు. దిల్ రాజు నుంచి ఎలాంటి సమాచారం లేదని తెలిపారు. కాగా, నెల రోజుల సమయం ఇస్తే థియేటర్లను రెన్యువల్ చేసుకుంటామని డిస్ట్రిబ్యూటర్లు మంత్రికి హామీ ఇచ్చినట్లు సమాచారం.
జుట్టు రాలడం ఆగాలంటే ఏం చేయాలి.. రోజూ షాంపూ పెట్టొచ్చా ?
ఉదయాన్నే ఈ ద్రావణం తాగితే అదుపులో డయాబెటిస్..!
కనురెప్పల అందానికి వంటింటి చిట్కాలు.. అవి ఏంటో తెలుసా..?
చేపలను తరచూ తింటే కలిగే అద్భుత ప్రయోజనాలివే..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..