Cheetah @ Tirumala | తిరుమల-అలిపిరి బాట దారిలో ఓ చిన్నారిపై చిరుత దాడి ఘటన మరువక ముందే మరోమారు చిరుత సంచారం కలకలం రేపింది. తిరుమల తిరుపతి ఘాట్ రోడ్డులోని 56వ మలుపు వద్ద బుధవారం చిరుత కనిపించడంతో భక్తులు భయాందోళనకు గురయ్యారు. ఈ సమాచారంతో ఆంధ్రప్రదేశ్ అటవీశాఖ అధికారులు అప్రమత్తం అయ్యారు. జీఎన్సీ వద్ద వాహనదారులు గుంపులు గుంపులుగా పంపుతున్నారు. చిరుత పులిని దారి మళ్లించడానికి అటవీశాఖ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.
కర్నూల్ జిల్లా ఆదోనీకి చెందిన దంపతులు తమ కుమారుడు కౌశిక్తో కలిసి ఇటీవల అలిపిరి నుంచి తిరుమలకు కాలినడకన బయలుదేరారు. మొదటి ఘాట్ రోడ్డు వద్ద ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయానికి సమీపంలో వీరు భోజనం చేస్తుండగా, కౌశిక్ ఆడుకుంటున్నాడు. అప్పుడే అకస్మాత్తుగా వచ్చిన చిరుత.. ఆ బాలుడిని నోట కరుచుకుని అడవిలోకి వెళుతుండగా అక్కడ గల ఒక దుకాణ యజమాని, బాలుడి తల్లిదండ్రులు, భద్రతా సిబ్బంది కేకలేస్తూ చిరుత పులి వెంట పరుగులు తీశారు. టార్చిలైట్లు వేస్తూ రాళ్లు విసురుతూ కేకలేయడంతో భయాందోళనలతో చిరుత.. ఆ బాలుడ్ని పోలీస్ ఔట్ పోస్ట్ వద్ద వదిలేసి పారిపోయింది.
బాలుడికి చెవి వద్ద, తలపై గాయాలతో బయట పడ్డాడు. చిరుతపులిని బంధించిన అటవీ సిబ్బంది అడవుల్లో వదిలేయడంతో భక్తులు ఊపిరి పీల్చుకున్నారు. కానీ, మళ్లీ చిరుత పులి కనిపించడంతో భక్తులు ఆందోళన చెందుతున్నారు.